తాడిపత్రి (Tadipatri) రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి (Ketireddy)పై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. “కేతిరెడ్డి తాడిపత్రికి వస్తే తిరిగి వెళ్లడు. బైక్లపై వచ్చే వైసీపీ కార్యకర్తలూ తిరిగిపోవాల్సిన అవసరం ఉండదు. పెద్దవడుగూరు (Peddavaduguru)లోని వైసీపీ నాయకులను కూడా వదిలిపెట్టేది లేదు” అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ వ్యాఖ్యలతోపాటు, “గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని నేనూ కోరుకుంటున్నా” అని జేసీ చెప్పడం గమనార్హం. ఆయన మాటలు ఇప్పుడు తాడిపత్రి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తన సొంత నియోజక వర్గం తాడిపత్రిలోకి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Ketireddy Pedda Reddy) కి ఏపీ హైకోర్టు (AP High Court) అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాడిపత్రి వెళ్లేందుకు కోర్టు ఆయనకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఆయనకు రక్షణ కల్పించేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేయగా.. పెద్దారెడ్డి నియోజక వర్గంలోకి అడుగు పెడుతున్నాడని తెలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి దూరం అయ్యారు. నియోజక వర్గంలో పెద్దారెడ్డి ఇంటివద్ద గుర్తు తెలియని వ్యక్తులు టిప్పర్ వాహనంలో రాళ్లను పడేసి వెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ విషయంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇది కేతిరెడ్డిపై దాడికి ముందస్తు యత్నమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.