యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) మరోసారి తన అద్భుతమైన ఫామ్, నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ (England)తో ఓల్డ్ ట్రాఫోర్డ్ (Old)లో జరుగుతున్న నాల్గవ టెస్టు మ్యాచ్లో అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించి, భారత క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గత 50 సంవత్సరాలలో ఓల్డ్ ట్రాఫోర్డ్లో అర్ధ సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్ బ్యాట్స్మెన్గా యశస్వి జైస్వాల్ నిలిచాడు.
టాస్ ఓడిపోయిన తర్వాత మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్తో కలిసి మొదటి వికెట్కు 94 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. రాహుల్ (Rahul) ఔటైన తర్వాత కూడా యశస్వి జైస్వాల్ తన దూకుడును కొనసాగించాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి చరిత్ర సృష్టించాడు. గత 50 ఏళ్లలో ఈ మైదానంలో ఏ భారత ఓపెనర్ చేయలేని ఘనతను జైస్వాల్ పూర్తి చేసి సరికొత్త చరిత్ర నెలకొల్పాడు.
యశస్వి జైస్వాల్ చరిత్రాత్మక ఇన్నింగ్స్ వివరాలు
మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగిన తొలి ఇన్నింగ్స్లో యశస్వి 58 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడి అద్భుతమైన బ్యాటింగ్ను ప్రదర్శించాడు. ఈ సమయంలో అతను 107 బంతులు ఎదుర్కొని, 10 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో తన ఇన్నింగ్స్ను చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. అతని ఈ ఇన్నింగ్స్ భారత ఇన్నింగ్స్ను బలోపేతం చేయడమే కాకుండా, అతనికి ఒక ప్రత్యేక రికార్డును కూడా సృష్టించింది. గత 51 సంవత్సరాలలో ఓల్డ్ ట్రాఫోర్డ్లో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి భారత ఓపెనర్గా యశస్వి నిలిచాడు.
భారత జట్టు ఓపెనింగ్లో గతంలో సునీల్ గావస్కర్ వంటి దిగ్గజాలు ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో పరుగులు చేసినప్పటికీ, గత ఐదు దశాబ్దాలుగా ఏ భారత ఓపెనర్ కూడా ఇక్కడ అర్ధ సెంచరీ మార్కును దాటలేదు. ఈ మైదానంలో టీమిండియా రికార్డు కూడా అంత ఆశాజనకంగా లేదు. 1936లో తొలిసారి ఈ మైదానంలో అడుగుపెట్టిన భారత్, ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో, యశస్వి జైస్వాల్ సాధించిన ఈ అర్ధ సెంచరీ ఒక సాధారణ స్కోరు కాదని, ఇది ఒక చారిత్రాత్మక ఘనత అని క్రికెట్ పండితులు కొనియాడుతున్నారు.







