సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మూడేళ్లు సీఎంగా ఉంటారని, ఆ తర్వాత తాను ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ, కేసీఆర్ కూతురు కావడం మినహా ఆమెకు ఉన్న అర్హత ఏంటి? అని ప్రశ్నించారు.
“రేవంత్ తర్వాత నేను సీఎం కావడానికి ప్రయత్నిస్తా“
తాజాగా మీడియాతో మాట్లాడిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కోసం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. వచ్చే ఐదేళ్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే తన అప్పీల్ను ప్రజల ముందు ఉంచారని అన్నారు. అయితే, తాను మాత్రం వచ్చే తొమ్మిదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని వెల్లడించారు. “ముఖ్యమంత్రిగా రేవంత్ దిగిపోయాక.. నేను ముఖ్యమంత్రి స్థానం కోసం ప్రయత్నిస్తాను. ప్రజల దగ్గర అప్లికేషన్ పెడతాను” అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్పై ఆరోపణలు
బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన జగ్గారెడ్డి, గత పదేళ్లుగా బీఆర్ఎస్ పాలన ఫోన్ ట్యాపింగ్తోనే నడిచిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నాయకులు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వం నిఘా పెట్టిందని, తన ఫోన్ ట్యాప్ అయిందని పోలీసులు స్వయంగా తమకు చెప్పారని తెలిపారు. “గత పదేళ్లు బీఆర్ఎస్.. పరిపాలనను గాలికొదిలేసి ఫోన్ ట్యాపింగ్ మీదే పడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ట్యాపింగ్తోనే పరిపాలన చేశారు. భార్యాభర్తలు మాట్లాడుకునే విషయాలు కూడా రికార్డు చేశారు” అని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
కవితపై విమర్శల వర్షం: “దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది”
ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై జగ్గారెడ్డి మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలు “దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి” అంటూ ఎద్దేవా చేశారు. కవిత ఓవరాక్షన్ చేస్తున్నారని, అంత అవసరం లేదని అన్నారు. “కేసీఆర్ కూతురు మినహా మీకు ఉన్న అర్హత ఏంటి?” అని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ రిజెక్ట్ చేసినా పొలిటికల్ ఇమేజ్ కోసం కవిత ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
“రేవంత్ రెడ్డి, కేసీఆర్ స్థాయి ఒక్కటే. వారిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తే అర్థం ఉంది.. కవిత స్థాయి ఏంటి?. కవిత ఒక మాఫియా డాన్ అయిపోయింది. ఆమె వల్ల కేజ్రీవాల్, సిసోడియా ఖతమైపోయారు” అంటూ జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంపై హరీష్ రావు చేస్తున్న విమర్శలను కూడా జగ్గారెడ్డి ఖండించారు. “బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు 5, 6 నెలలకు వేసేవారు. మా ప్రభుత్వంలో 9 రోజుల్లోనే 9 వేల కోట్లు జమ చేశాం. వారు చేయలేని పని కాంగ్రెస్ చేసిందనే అసూయతో హరీష్ రావు మాపై విమర్శలు చేస్తున్నారు” అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.