విద్యారంగం వ్యాపారం నుంచి రాజకీయ రంగు పులుముకుంది. కార్పొరేట్ ముసుగులో ఫీజుల బూతం దశాబ్దాలుగా విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చేస్తోంది. తల్లిదండ్రులను దోచుకునేందుకూ కాంపిటీషన్ ప్రారంభమైంది. అడ్మీషన్లు, ర్యాంకుల కోసం జరుగుతున్న ఈ కార్పొరేట్ వ్యాపార పోరు ప్రత్యర్థి సంస్థలపై దాడులు చేయించేంత అధ్వాన్న స్థితికి దిగజారిపోయింది. అందుకు ఆంధ్రరాష్ట్రంలోనే కాదు యావత్ దేశ వ్యాప్తంగా శ్రీచైతన్య విద్యాసంస్థలపై జరుగుతున్న ఇన్కం ట్యాక్స్ దాడులే నిదర్శనం అంటున్నారు నిపుణులు.
శ్రీచైతన్య విద్యా సంస్థలను దేశ వ్యాప్తంగా విస్తరింపజేసిన డాక్టర్ బొప్పన్న సత్యనారాయణ రావు (బీఎస్ రావు) ఏడాదిన్నర క్రితం మృతిచెందారు. ఆ తరువాత శ్రీచైతన్య ఇనిస్టిట్యూషన్ల బాధ్యతలన్నీ ఆయన కుమార్తెలే చూసుకుంటున్నారు.
గత రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో చైతన్య కళాశాలల శాఖల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. అయితే దీనిపై అధికారుల ప్రకటనలు ఎలా ఉన్నా.. ఎడ్యుకేషన్ సిస్టమ్ గ్రూప్స్లో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఆసక్తిరేపుతోంది. సదరు విద్యా సంస్థపై జరుగుతున్న ఐటీ దాడులు సర్వసాధారణంగా జరిగేవి కావనే చర్చ జోరుగా సాగుతోంది.
మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో పేరుమోసిన రెండు కార్పొరేట్ విద్యా సంస్థల మధ్యే పోటీ నెలకొంటుంది. ర్యాంకుల కోసం విద్యార్థులపై రేయింబవళ్లు చదువును రుద్దే ప్రయత్నం చేసేది కూడా ఇవే. రాష్ట్రంలో అధికారం మారడంతో విద్యా సంస్థల యజమాని ఒకరు మంత్రి అయ్యారు. ఆ తరువాత ఆ సంస్థలోని సిబ్బంది నోటికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించడం, ఇష్టానుసారంగా వ్యవహరించడం లక్షల్లో ఫీజులు చెల్లించే వారికి నచ్చడం లేదు. దీంతో తల్లిదండ్రులు శ్రీచైతన్య వైపు మొగ్గు చూపారు. ఇటీవల శ్రీచైతన్య విద్యా సంస్థలలో అడ్మీషన్లు విపరీతంగా పెరిగిపోయాయట. విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ ఈ విద్యా సంస్థపై సానుకూల స్పందన రావడాన్ని సహించలేని మంత్రి అయిన మరో విద్యా సంస్థల యజమాని తనకున్న రాజకీయ పలుకుబడితో పెట్టిన దిష్టే ఈ ఐటీ రైడ్స్కు కారణమని అంతర్గతంగా చర్చ జరుగుతోంది.