ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్.. ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ లిసా గిల్ నియామకం న్యాయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు.
ఇక ఆయన పదవీ విరమణ అనంతరం జస్టిస్ లిసా గిల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. దీంతో ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించనున్నారు. న్యాయరంగంలో ఆమెకు ఉన్న అనుభవం, సేవలను దృష్టిలో ఉంచుకుని ఈ పదవి బాధ్యతలు అప్పగించనున్నట్లు న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి.








