తెలుగుఫీడ్ డెస్క్:
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా జనం భారీ సంఖ్యలో వచ్చేస్తున్నారు. దానికి కారణం ఏంటి? ఆ జనాన్ని చూసి కూటమిలో కలకలం.. కలవరం మొదలైందా? అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.
ఎన్నికల్లో ఓడిన దగ్గర నుంచి వైఎస్ జగన్ ఇటీవల వరకు పలు ప్రాంతాల్లో పర్యటిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మొన్నామధ్య బుడమేరు వరదల కారణంగా విజయవాడలో బాధితుల పరామర్శకు వెళ్లినా, గోదావరి జిల్లాల్లో పంటలు దెబ్బతిన్న రైతన్నలను ఓదార్చడానికి వెళ్లినా, అటు తర్వాత నడిరోడ్డుపై హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినా, విజయనగరం జిల్లాలో డయేరియా బాధితులను పరామర్శించినా, అత్యాచారం, దాడులకు గురైన ఆడబిడ్డలను పరామర్శించేందుకు వెళ్లినా, ఆ పార్టీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లాంటి వారిని పరామర్శించేందుకు జైలు వద్దకు వెళ్లినా, పెళ్లి వేడుకలకు వెళ్లినా… జగన్ వెంట తండోప తండాలుగా జనం వచ్చేస్తున్నారు. ఎన్నికలు లేకపోయినా, సమీపంలో వచ్చే అవకాశం లేకపోయినా జనం అంతలా జగన్ ను చూసేందుకు ఎగబడటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

యాక్టివ్గా వైఎస్ జగన్
2014 ఎన్నికల ఫలితాల అనంతరం మాదిరిగా జగన్ ఇప్పుడు సైలెంట్ అయిపోలేదు. అప్పుడూ ఇలాగే అవతలివైపున మూడు పార్టీలు ఏకమై పోటీ చేస్తే నాడు వైఎస్ జగన్ కు 67 అసెంబ్లీ సీట్లు దక్కాయి. ఇప్పుడు 5 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజలకు అన్ని రకాలుగా సంక్షేమం, అభివృద్ధి సాకారం చేశారన్న పేరు సాధించినప్పటికీ 11 సీట్లకే పరిమితం కావడంపై అనేక అనుమానాలు రేకెత్తాయి. ఈవీఎంల పనితీరుపై ఎన్నికల తర్వాత పెద్ద చర్చే జరుగుతోంది. ఈ క్రమంలో జగన్ కు 11 సీట్లే వచ్చినా 40 శాతం ఓటు బ్యాంకు పదిలంగా ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ యాక్టివ్ గా ఉన్నారు. ఓటమి నుంచి అత్యంత వేగంగా కోలుకున్నారు.

99 శాతం హామీలు సాకారం
ఐదేళ్ల పరిపాలనలో ప్రజలకిచ్చిన హామీలన్నీ 99 శాతం నెరవేర్చానంటూ వైఎస్ జగన్ పదే పదే సభల్లో చెబుతూ వచ్చారు. రూ.2.72 లక్షల కోట్ల డబ్బును ప్రజలకు డీబీటీ ద్వారా అందించామని నేటికీ స్పష్టంగా చెబుతారు. నాన్ డీబీటీ సహా అభివృద్ధి కార్యక్రమాలను చరిత్రలో నిలిచిపోయేలా చేశామని గర్వంగా చెబుతుంటారు. అందుకే ప్రజల వద్దకు తాను, తన పార్టీ కార్యకర్తలు, నాయకులు కాలర్ ఎగరేసుకుని వెళ్తామని, ఇలాంటి అర్హత మరే పార్టీకి లేదనే మాట ఆయన చెబుతుంటారు.

జగన్ ఎక్కడికెళ్లినా జనసందోహం.. కారణం?
ఓటమి తర్వాత వైఎస్ జగన్ యాక్టివ్ గానే ఉన్నారు. ఓటమికి కుంగిపోకుండా పార్టీ శ్రేణులు, నాయకులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో పార్టీ శ్రేణులను, సామాన్య ప్రజలనూ కలుసుకుంటానని చెబుతున్నారు. ఈ క్రమంలో జగన్ ను చూసేందుకు సామాన్య ప్రజానీకం అమితాసక్తి కనబరుస్తున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి. హామీలిచ్చి గద్దెనెక్కిన రాజకీయ నాయకులు ఒకవైపు ఉంటే, చిత్తశుద్ధి, అకింత భావంతో జగన్ పరిపాలన నిజాయితీగా చేశారని, అందుకే జగన్ పై జనానికి నమ్మకం అని పొలిటికల్ పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ వెంట జనం పరుగులు పెడుతున్నారని, కార్యక్రమం ఏదైనా ముందస్తు సమాచారం లేకపోయినా జగన్ ను చూడాలన్న తపన ప్రజలు, అభిమానుల్లో ఉందంటున్నారు.

సంక్షేమ పథకాలు అందుకున్న కృతజ్ఞత?
రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో సంక్షేమ పథకాల ద్వారా పేదలు, మధ్య తరగతి వర్గాలు భారీగా లబ్ధి పొందాయి. ఆ పథకాలన్నీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత నిలిచిపోయాయి. దీంతో అనేక వర్గాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ కాలం వెళ్లదీస్తున్నాయి. ఆర్థిక చేయూత లేక, ఉపాధి అవకాశాలు దొరక్క, ప్రభుత్వం ఆదుకోక కష్టాలు పడుతున్న బడుగు వర్గాలు గతంలో జగన్ అందించిన సంక్షేమం గుర్తు చేసుకుంటున్నారనేది వాస్తవికమే. వైఎస్ జగన్ సంక్షేమంతో సరిపెట్టకుండా పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఉద్యోగాలు, పరిశ్రమల స్థాపనతో ప్రైవేటు ఉద్యోగాలు సైతం కల్పించిన పరిస్థితులు.. ఇప్పుడు కూటమి సర్కార్ చేయకపోవడంతో ఆయా వర్గాల్లో పెల్లుబుకుతున్న నిరసనే జగన్ కార్యక్రమాలకు జనం రావడానికి కారణమన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఈ జనసందోహాన్ని చూసి కూటమి పార్టీల నేతల్లో కలవరం మొదలైందనే చర్చ జరుగుతోంది.