చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే.. ఆయన ఆస్తులు పెంచుకోవడం, ఆయన అనుచరుల ఆస్తులు పెంచుకోవడం మాత్రమే సంపద సృష్టి అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో జరగని స్కామ్ లేదని, ఇసుక నుంచి కాంట్రాక్ట్ల వరకు ప్రతీ అంశంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ అని వాగ్దానం చేశాడని, కానీ తొమ్మిది నెలల పరిపాలనలోనే బాబు ష్యురిటీ- మోసం గ్యారంటీగా మారిందని సెటైర్లు వేశారు. హామీలు అమలు చేయకుంటే చొక్కా పట్టుకోండి అని చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన మాట మరిచిపోయారా..? అని ప్రశ్నించారు. మేనిఫెస్టోలు, బాండ్లు ఏమయ్యాయి? ఇప్పుడెవరు చంద్రబాబుని ప్రశ్నించాలి? అంటూ నిలదీశారు.
ఏపీపై అప్పుల భారం
కూటమి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో రూ.1.45 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. అమరావతిని నెపంగా పెట్టుకుని రూ.52,000 కోట్ల అప్పు చేయడం, పథకాలకు అసలు నిధులు లేకుండా చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ఆదాయ వనరులను అడ్డగోలుగా దోచుకోవడంతో అభివృద్ధి, సంక్షేమం నిలిచిపోయాయన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాలు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు, కనీసం వలంటీర్లకు ఇచ్చిన మాటనే నిలబెట్టుకోలేకపోయాడన్నారు. 2.6 లక్షల మంది వలంటీర్లను తొలగించారని, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అన్యాయం జరిగిందన్నారు.
ఇసుక నుంచి కాంట్రాక్ట్ల వరకు ప్రతీ విషయంలో అవినీతి జరుగుతుందని, వ్యాపారం చేయాలంటే లోకల్ ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. లోకల్ ఎమ్మెల్యే ఆ వాటాలను పెదబాబుకు ఇంత, చినబాబుకు ఇంత అని వాటాలు పంచుకుంటున్నారని వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దిగజారిపోయిందని, రాష్ట్ర వృద్ధికి అవసరమైన ప్రాజెక్టులు తుంగలో తొక్కారనన్నారు.