కల్తీ మద్యం (Fake Liquor) కేసులో ఆంధ్రరాష్ట్రం (Andhra State)లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఆధారాలతో దొరికిపోయిన అధికార పార్టీ.. ఆ మచ్చను ప్రతిపక్ష వైసీపీపై వేసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. నకిలీ మద్యం కేసు వెలుగులోకి వచ్చిన సమయంలోనే టీడీపీ(TDP) కండువా కప్పుకున్న ఇద్దరి నేతల ఫొటో వైరలవ్వడం, ఇదంతా అధికార పార్టీ పనేనని ప్రజలంగా ముద్రపడిపోయింది. ఇది గ్రహించిన టీడీపీ రకరకాల డైవర్షన్లతో ఈ కేసును రోజుకో విధంగా మలుపుతున్నారనే చర్చ ఆంధ్రరాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. అయితే ఈ కేసులో తాజాగా జరుగుతున్న సంఘటన ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది.
నిన్న సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సెల్ఫోన్లు మార్మోగుతున్నాయి. ఐవీఆర్ఎస్ కాల్స్ (IVRS Calls) ద్వారా ప్రజల చెవుల్లోకి ఓ వాయిస్ను పంపిస్తున్నారు. మద్యం కుంభకోణాన్ని వైసీపీ చేయిస్తూ, కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తోందనేది ఆ కాల్ సారాంశం. నిన్నటి నుంచి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఈ కాల్స్ వస్తున్నాయి. అయితే కోర్టులో ఉన్న కల్తీ మద్యం కేసు అంశాన్ని ఈ విధంగా డైవర్ట్ చేయడం ఏంటని, చేతుల్లో ఉన్న అధికారంతో తప్పును నిరూపించకుండా, ఇలా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల్లో విష ప్రచారం చేయడం ఏంటని ప్రతిపక్ష వైసీపీ ప్రశ్నిస్తోంది.
ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి ప్రజల ఫోన్ నంబర్ల డేటా ఎక్కడి నుంచి వచ్చేందనే ప్రశ్నను కూడా వైసీపీ లేవనెత్తుతోంది. గత టీడీపీ ప్రభుత్వంలో తస్కరించిన ప్రజల డేటాను ఇప్పుడు వాడుకుంటున్నారనే ఆరోపణలు చేస్తోంది. చౌర్యం చేసిన డేటాను ఇలా దుర్వినియోగం చేస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ఈ కేసులో ముఖ్య ఘట్టాలు
- ములకలచెరువులో లభించిన కల్తీ మద్యంతో ఈ కేసులో టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి (Jayachandra Reddy), సురేంద్ర నాయుడు (Surendra Naidu) దొరికారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్రావు కూడా తెలుగుదేశం పార్టీ నేతే అని తేలిపోయింది. ఈ కేసు వెలుగులోకి రావడంతో జరుగుతున్న డ్యామేజీని పసిగట్టి, సొంత పార్టీవారైనా చర్యలు తీసుకున్నామంటూ టీడీపీ తంబళ్లపల్లె నేత జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత జయచంద్రారెడ్డి వైసీపీ కోవర్ట్ అని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి అని రకరకాల కథనాలు, ప్రసారం అయ్యాయి.
- అనంతరం నకిలీ మద్యం ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు వీడియో ఆఫ్రికా నుంచి రిలీజ్ అయ్యింది. అందులోనూ అసలు వైసీపీపై గానీ, ఆ పార్టీ నేతలపై గానీ ఎలాంటి విమర్శలూ లేవు. ఇబ్రహీంపట్నంలో దొరికిన జనార్దన్రావు కల్తీ మద్యం తయారీ గోడౌన్కు తన అనుచరులతో వెళ్లిన జోగి రమేష్.. ఇదంతా ప్రభుత్వ కుట్రేనని మీడియా ముందు మాట్లాడారు.
- ఆ వెంటనే ఈ దందాలో మాజీ మంత్రి జోగి రమేష్ పేరును తెరపైకి తెచ్చారు. జోగి రమేష్ ఆదేశాలతోనే తాను నకిలీ మద్యం తయారు చేస్తున్నానని జనార్దన్ రావుతో స్టేట్మెంట్ ఇప్పించిన వీడియో రిలీజ్ అయ్యింది. ఆరోపణలపై జోగి రమేష్ తీవ్రంగా స్పందిస్తూ లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమని, బెజవాడ కనకదుర్గమ్మ, తిరుమల వెంకన్న స్వామి ఆలయంలో సత్యప్రమాణానికి సిద్ధమని, చంద్రబాబు, లోకేష్ రావాలని సవాల్ విసిరారు. జోగి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.
- తాజాగా ఈ కేసులో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం జరుగుతోంది. ఫోన్ కాల్లో ‘‘ప్రభుత్వానికి బురదపూయడానికి వైసీపీ ఎంతకు తెగించిందో.. గత ఐదేళ్లుగా కల్తీ మద్యం చేస్తూ పట్టుబడ్డ నిందితుడు జనార్దన్ రావు మాటల్లో వినండి. ’జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకుని చేశాను సార్.. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో ఒక రకంగా మనం బురదజల్లాలి, వాళ్లను బ్యాడ్ చేయాలి, అని అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను’ ఈ మాటలు విన్నాక ప్రభుత్వం మీద బురదచల్లటానికి గతంలో వివేకానందరెడ్డి హత్యను టీడీపీ మీద వేసిన విషయం గుర్తురాక మానదు‘‘ అని కాల్లో ఓ వాయిస్ వినిపిస్తోంది.
వైసీపీ కోరినట్లు సీబీఐకి అప్పగించాల్సిందిగా..
కల్తీ మద్యం కేసు రోజుకో ఆసక్తికరమైన పరిణామంతో మలుపులు తిరుగుతుండడంతో ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం తప్పు చేసిన వైసీపీ సీబీఐ విచారణ కోరుతుండగా, కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించకుండా సిట్ ఎందుకు వేశారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నియమించిన సిట్ ద్వారా లోతైన దర్యాప్తులు జరుగుతున్నప్పుడు వీడియోలు, లీకులు బయటకు ఎందుకు వస్తున్నాయని చర్చించుకుంటున్నారు. జోగి రమేష్కు లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయిస్తే తేలిపోతుందని సలహా ఇస్తున్నారు. అలా కాకుండా రోజుకో కొత్త మలుపుతో తాత్సారం ఎందుకు చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ కల్తీ మద్యం కేసు రాబోయే రోజుల్లో ఇంకెన్ని ట్విస్ట్లు ఇవ్వనుందో వేచి చూడాలి.








