లక్షల రూపాయలు డబ్బు ఇచ్చి వైసీపీలో యాక్టీవ్గా ఉన్న నాయకుల ఫోన్లను సీఎం చంద్రబాబు నాయుడు ట్యాపింగ్ చేయిస్తున్నాడని మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు బంధువు ప్రకాశ్ అనే వ్యక్తితో రమేష్ ఆస్పత్రి సమీపంలో ఒక ఆఫీస్ పెట్టించి 17 మంది కానిస్టేబుళ్లకు జీతం కాకుండా మరో లక్ష రూపాయల క్యాష్ అదనంగా ఇస్తూ.. వైసీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నాడని పేర్ని నాని వివరించారు.
వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నవారందరి ఫోన్ల సంభాషణలు వారు వింటున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారని పేర్ని నాని చెప్పారు. మచిలీపట్నంలో 50 మున్సిపల్ డివిజన్లలోని కార్పొరేటర్లు, వైసీపీ నేతల ఫోన్ నంబర్లు, వాళ్ల భార్యలు, కొడుకులు, కూతుళ్ల నంబర్లు కలెక్ట్ చేస్తున్నారని, అదే విధంగా మచిలీపట్నంలోని వైసీపీ గ్రామ సర్పంచ్లు, గ్రామ స్థాయి నాయకులు, వారి భార్యల నంబర్లు కలెక్ట్ చేస్తున్నారన్నారు. వైసీపీ నాయకుల భార్యల ఫోన్ నంబర్లు పోలీసులకు ఎందుకు అని ప్రశ్నించారు.
‘పార్టీలో తిరిగితే మీ భర్తలను అరెస్టు చేస్తాం, జైల్లో పెడతా’మని వైసీపీ నేతల భార్యలకు ఫోన్లు చేసి బెదిరించడానికి నంబర్లు కలెక్ట్ చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా ఎస్పీ కనుసన్నల్లోనే వైసీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోందన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు తప్పుడు పనులు చేస్తున్నవారందరూ చట్టం ముందు నిలబడే రోజు వస్తుందని, ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండండి అని హెచ్చరించారు.