20 ఏళ్లుగా పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఓ వృద్ధురాలు.. అసహనంతో భారీ సాహసం చేసింది. కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజా పరిష్కార వేదిక’ (గ్రీవెన్స్ సెల్)లో అనూహ్య ఘటనకు పాల్పడింది. దశాబ్దాలుగా తన భూమికి పరిహారం అందడం లేదన్న ఆవేదనతో ఓ వృద్ధురాలు అధికారులపై కారం చల్లి నిరసన వ్యక్తం చేయడంతో విజయవాడ కలెక్టరేట్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ
నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన లక్ష్మీతులసి అనే వృద్ధురాలి భూమిని 2003లో జాతీయ రహదారుల (NHAI) విస్తరణ కోసం అధికారులు సేకరించారు. ఆ భూమికి సంబంధించి తనకు సుమారు 24 లక్షల రూపాయల నష్టపరిహారం రావాల్సి ఉందని ఆమె చెబుతున్నారు. అయితే, తన భూమిని తీసుకుని, ఆ పరిహారం సొమ్మును మాత్రం వేరే వ్యక్తులకు చెల్లించారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విసుగు చెంది కారం చల్లిన బాధితురాలు
పరిహారం కోసం గత కొన్ని ఏళ్లుగా ఆమె కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. అనేకమార్లు వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని, కేవలం ఒక అధికారి నుంచి మరొక అధికారికి తిప్పడమే తప్ప సమస్య పరిష్కారం కావడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుతో విసుగు చెందిన ఆమె, ఈసారి వెంట తెచ్చుకున్న కారం పొడిని అధికారులపై చల్లారు.
అధికారుల వివరణ
ఈ ఘటన తర్వాత కలెక్టరేట్ అధికారులు లక్ష్మీతులసిని పిలిపించి మాట్లాడారు. భూసేకరణ విభాగం అధికారులు రికార్డులను పరిశీలించి కీలక ప్రకటన చేశారు. సదరు భూమికి సంబంధించి పరిహారం చెల్లించాల్సింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అని, రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ విభాగానికి దీనితో సంబంధం లేదని స్పష్టం చేశారు. తదుపరి విచారణ, పరిహారం కోసం NHAI అధికారులనే సంప్రదించాలని సూచిస్తూ రెవెన్యూ అధికారులు ఆమెను పంపించివేశారు.








