కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్ని రంగాలకు హామీలు ఇచ్చినప్పటికీ, వాటిని నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా దారుణంగా విఫలమైందని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల గణన శాస్త్రీయ పద్ధతిలో చేయలేదని, ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితంలేకుండా పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల పట్ల కాంగ్రెస్కు నిజమైన చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తూ, ఈ ప్రభుత్వం మోసపూరితమైనదని మండిపడ్డారు.
సీపీఎస్ రద్దుపై కాంగ్రెస్ వైఫల్యం
సీపీఎస్ రద్దు విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఈటల రాజేందర్ అన్నారు. 9 నెలలలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విరక్తి పెరిగిందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో, గెలిచిన వారు కాంగ్రెస్లో చేరతారని సీఎం రేవంత్ రెడ్డి గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు.
టీచర్ల సమస్యలపై పోరాటం చేయగలిగే ఏకైక పార్టీ బీజేపీయేనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. దేశం సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలంటే బీజేపీకి ఓటు వేసి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.