ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బృందంతో కలిసి నేడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (World Economic Forum) సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా చంద్రబాబు పర్యటన సాగనుంది.నేడు మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు.
రాయబారులతో సమావేశాలు, ఆర్థిక సదస్సు
ఢిల్లీ నుంచి జ్యూరిచ్ వెళ్లి భారత రాయబారితో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా, ఆంధ్రప్రదేశ్లోని మౌళిక వసతులు, పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూ ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు జరపనున్నారు. ప్రత్యేకంగా రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక చర్చలు జరగనున్నాయి.
దావోస్ పర్యటన ప్రత్యేకత..
ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ మ్యాప్ పై పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉండే విధానాలను చంద్రబాబు ప్రదర్శించనున్నారు. అంతర్జాతీయ వేదికపై రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనాలు పొందే దిశగా చంద్రబాబు ఈ పర్యటనకు ప్రాధాన్యత ఇస్తున్నారు.