ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ కేటాయింపుల్లో స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థుల కోసం అమలు చేసే తల్లికి వందనం పథకంపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఒక కుటుంబంలో ఎంతమంది చదువుకునే విద్యార్థులు ఉంటే అంత మందికి రూ.15 వేల చొప్పున అందజేస్తామని, ఒక్కరుంటే రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురు పిల్లలుంటే రూ.45 అని ఎన్నికల సమయంలో కూటమి నేతలు వాగ్దానమిచ్చిన విషయం తెలిసిందే.
కాగా, అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల తరువాత పూర్తిస్థాయి బడ్జెట్ను కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టింది. బడ్జెట్ కేటాయింపులో తల్లికి వందనం పథకానికి రూ. 9,407 కోట్లు కేటాయించారు. వాస్తవానికి ఈ పథకం అమలు చేయాలంటే రూ.12 వేల కోట్లపైగా నిధులు అవసరం. కానీ ప్రభుత్వం రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్ష పార్టీల్లో అనుమానాలు మొదలయ్యాయి. బడ్జెట్ ప్రసంగంలోనూ ఒక కుటుంబంలో బడికి వెళ్లే పిల్లలందరికీ పథకం వర్తిస్తుందని చెప్పకపోవడం ఈ అనుమానాలకు మరింత బలాన్నిస్తున్నాయి.
వైసీపీ హయాంలో..
తల్లికి వందనం పథకం అమలులో షరతులు విధించి కోతలు పెడతారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున జమ చేసింది. తద్వారా బడికి వెళ్లే 83 లక్షల మంది విద్యార్థులకు జగన్ సర్కార్ లబ్ధి చేకూర్చింది.
ప్రస్తుత ప్రభుత్వంలో..
ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందిస్తామన్న చంద్రబాబు చెప్పింది. ప్రభుత్వ లెక్క ప్రకారం 83 లక్షల మంది విద్యార్థులు కాగా, ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున అంటే రూ.12,450 కోట్లు బడ్జెట్లో కేటాయించాల్సి ఉంది. కానీ, కూటమి ప్రభుత్వం రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే కోత తప్పదా..? అనే అనుమానం మొదలైంది. గతేడాది తల్లికి వందనం నిధులు కేటాయించి ఎగనామం పెట్టిన విషయం తెలిసిందే.