ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులపై తీవ్రంగా స్పందించారు. కొందరు వ్యక్తులు రాజకీయ ముసుగులో సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఆయన కొన్ని కీలక చర్యలు చేపట్టారు.
నియంత్రణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు
సోషల్ మీడియా పోస్ట్ల నియంత్రణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ కమిటీలో మంత్రులు లోకేశ్, మనోహర్, అనిత, సత్య కుమార్ యాదవ్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ద్వారా శాంతి భద్రతలు అదుపులోకి వస్తాయి అని సీఎం తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన, తప్పుడు సమాచారాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
కమిటీ అందరినీ ఒకే దృష్టితో చూస్తుందా.. ?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష వైసీపీ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు బనాయిస్తూ స్టేషన్లు, జైళ్లు చుట్టూ తిప్పుతుందనే ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి. సోషల్ మీడియా యాక్టివిస్టు అరెస్టు అక్రమమని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసభ్యకర పోస్టులంటూ వైసీపీ వారిని అరెస్టు చేస్తున్న కూటమి ప్రభుత్వం.. జగన్ కుటుంబంపై, వైసీపీ మహిళా నేతలపై టీడీపీ యాక్టివిస్టులు చేసే అతి జుగుప్సాకరమైన పోస్టులను ఎందుకు కట్టడి చేయడం లేదని, వారిని మాత్రం ఎందుకు అరెస్టులు చేయడం లేదని పలువురు వైసీపీ నేతలు ప్రశ్నిస్తూనే ఉన్నారు.
మరిప్పుడు సోషల్ మీడియా నియంత్రణ కోసం చంద్రబాబు వేసిన కమిటీ అందరినీ ఒకే దృష్టితో చూస్తుందా.. లేక వైసీపీ యాక్టివిస్టులే టార్గెట్గా చర్యలకు పూనుకుంటుందా అనేది వేచి చూడాలి.