ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో సచివాలయంలో సమావేశమైన మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మినహా మిగతా మంత్రులందరూ హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా పవన్ కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టినట్లుగా తెలుస్తోంది. కాగా, మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యంగా, బీసీలకు 34% రిజర్వేషన్లు, పరిశ్రమలకు భూ కేటాయింపులు, రిజిస్ట్రేషన్ విలువల పెంపు వంటి అంశాలపై చర్చించారు. ప్రభుత్వ నిర్ణయాలు, పబ్లిక్ పాలసీలపై చర్చించిన అనంతరం మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు.
ఫిబ్రవరి 24 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలపై మంత్రులు సమాలోచనలు జరిపారు. సీఎం చంద్రబాబు మంత్రులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. రాబోయే మూడు నెలల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలక భూమిక పోషించాలని చంద్రబాబు ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం అమలు చేయనున్నట్లు సీఎం వెల్లడించినట్లుగా తెలుస్తోంది. అదనంగా ఏప్రిల్లో మత్స్యకార భరోసా పథకంపై మరింత దృష్టిపెట్టాలని సూచించినట్లు సమాచారం.