బంగ్లాదేశ్ (Bangladesh) లో దేశద్రోహం (Treason) కేసులో అరెస్ట్ (Arrest) అయిన హిందూ నేత చిన్మోయ్ కృష్ణ దాస్ (Chinmoy Krishna Das) కి బంగ్లాదేశ్ హైకోర్టు (Bangladesh High Court) బెయిల్ (Bail) మంజూరు చేసింది. ఇస్కాన్ (ISKCON) ప్రతినిధి, బంగ్లాదేశ్ సమ్మిలిత్ సతానత జాగ్రన్ జోట్ నేత అయిన చిన్మోయ్ కృష్ణ దాస్ను నవంబర్ 25న ఢాకా ఎయిర్ పోర్టులో బంగ్లాదేశ్ అధికారులు అరెస్ట్ చేశారు. అతడిపై బంగ్లాదేశ్ జెండాను అవమానించడంతో దేశద్రోహం కేసు నమోదైంది. తాజాగా, జస్టిస్ ఎండీ అటోర్ రెహమాన్ మరియు జస్టిస్ ఎండీ అలీ రెజాతో కూడిన ధర్మాసనం అతడికి బెయిల్ మంజూరు చేసింది.
గతేడాది ఆగస్టులో విద్యార్థుల హింసాత్మక ఉద్యమం తర్వాత షేక్ హసీనా (Sheikh Hasina) పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చారు. తరువాత, బంగ్లాదేశ్లో మహ్మద్ యూనస్ (Muhammad Yunus) నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే, షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత, బంగ్లాదేశ్ వ్యాప్తంగా మైనారిటీలు, ముఖ్యంగా హిందువులు టార్గెట్గా దారుణమైన హింసకు గురయ్యారు. హిందువుల ఇళ్లు, ఆస్తులు, వ్యాపారాలు, గుడులను మతోన్మాదులు టార్గెట్ చేసి దాడులకు పాల్పడ్డారు.
ఈ సమయంలో చిన్మోయ్ కృష్ణ దాస్ మైనారిటీ హక్కుల కోసం కఠినంగా నినదించారు. దీంతో, అతడిని సైలెంట్ చేసేందుకు యూనస్ సర్కార్ దేశద్రోహం కేసు పెట్టింది. పలు సందర్భాల్లో అతడి బెయిల్ను కింది కోర్టులు తోసిపుచ్చాయి. అతడి తరుపున వాదించడానికి కూడా లాయర్ రాని పరిస్థితి ఏర్పడింది. ముస్లిం బార్ అసోసియేషన్ అతడి తరుపున వాదించవద్దని హెచ్చరికలు జారీ చేసింది.
నవంబర్ 27న చట్టోగ్రామ్ (చిట్టగాంగ్) (Chittagong) కోర్టు వెలుపల చిన్మోయ్ కృష్ణ దాస్ అనుచరులు మరియు అధికారులు మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది, ఇందులో ఒక న్యాయవాది మరణించారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.