ఇటీవల కాలంలో హార్ట్ ఎటాక్లు (Heart Attacks) విపరీతం అయిపోయాయి. గుండెపోటు మరణాలు చిన్న వయస్సు వారిలోనే అధికంగా సంభవిస్తున్నాయి. అయితే తాజాగా రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం సికార్ (Sikar) జిల్లాలోని దంతా పట్టణం ఓ హృదయ విదారక సంఘటన కార్డియా అరెస్ట్కు వయస్సుతో ఎలాంటి సంబంధం లేదనే వాదనను రుజువుచేస్తోంది. కేవలం 9 ఏళ్ల (Nine Years Old) వయసున్న ప్రాచి కుమావత్ (Prachi Kumawat) అనే నాలుగో తరగతి (Fourth Grade) విద్యార్థిని (Student) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటన తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
అసెంబ్లీలో చురుకుగా పాల్గొన్న తర్వాతే..
ఉదయం స్కూలుకు వచ్చి, పాఠశాల ప్రార్థన కార్యక్రమంలో ప్రాచి చురుగ్గా పాల్గొంది. అయితే మధ్యాహ్న భోజన సమయంలో ఆమె అకస్మాత్తుగా స్పృహ కోల్పోయింది. వెంటనే స్కూల్ సిబ్బంది అప్రమత్తమై ఆమెను సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
CHC ఇన్చార్జ్ డాక్టర్ ఆర్కే జాంగిద్ (Dr. R.K. Jangid) మాట్లాడుతూ.. బాలికను కాపాడేందుకు దాదాపు గంటన్నర పాటు CPR ప్రయత్నాలు చేశామన్నారు. కానీ అప్పటికే ప్రాచి పల్స్ తగ్గిపోయి, ఊపిరి ఆడక, గుండె ఆగిపోయింది. ఇది పుట్టుకతో ఉన్న గుండె లోపం వల్ల జరిగి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. ప్రాచి ఉదయం చిరునవ్వుతో క్లాసుల వైపు నడుస్తున్నట్లు కనిపించిందని సిబ్బంది చెప్పారు. కానీ కొద్ది గంటల వ్యవధిలోనే ఆ చిరునవ్వు విషాదంగా మారటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
ఈ ఘటనతో చిన్న వయసులో గుండె సంబంధిత సమస్యలు ఎంత ప్రమాదకరమో స్పష్టమవుతోంది. ఇటీవల కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లోనూ చిన్నారులు గుండెపోటుతో మృతి చెందుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో, వైద్య నిపుణులు పిల్లల ఆరోగ్యంపై ముందస్తు పరీక్షలు, హెల్త్ స్క్రీనింగ్స్ చేపట్టాలని సూచిస్తున్నారు.
పాఠశాలలు, తల్లిదండ్రులు అప్రమత్తంగా
ఈ సంఘటన పాఠశాలలలో ప్రాథమిక ఆరోగ్య సదుపాయాల అవసరాన్ని, పిల్లల్లోని అసాధారణ లక్షణాలను గమనించే బాధ్యతను మరింత బలంగా గుర్తు చేస్తోంది. చిన్నారుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఎప్పుడూ ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.








