పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం(CM) చంద్రబాబు (Chandrababu) అన్నారు. మొంథా తుపాను (Montha Cyclone ) సమయంలో అందరూ సమష్టిగా పనిచేయడం వల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం తగ్గించగలిగామన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పెదఈర్లపాడులో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు.
సీఎం మాట్లాడుతూ.. గత పాలకులు రాష్ట్రాన్ని అన్ని విధాలా సంక్షోభంలోకి నెట్టారని వైసీపీని ఉద్దేశించి మాట్లాడిన సీఎం.. తనకు అనుభవం ఉందని, అన్నీ తెలిసిన డాక్టర్ (Doctor)ను తాను అని, తనకే నాడి అంతుపట్టడం లేదన్నారు. వ్యవస్థలన్నీంటినీ గాడిలో పెడుతున్నట్లు వివరించారు.
మళ్లీ టీడీపీ(TDP) అధికారంలోకి రావడంతో ప్రపంచంలోని అందరికీ నమ్మకం వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు ఏపీ అంటే ఛీఛీ అనేవారు.. ఇప్పుడు భలే భలే ఏపీ అంటున్నారని చెప్పారు. భావితరాల భవిష్యత్తు కోసం తాము కృషి చేస్తున్నామని, చదువు పూర్తయ్యే సరికి యువతకు వారి ప్రాంతాల్లోనే ఉద్యోగాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలనేది తన కల అని సీఎం చంద్రబాబు అన్నారు.
క్వాంటం మిషన్ (Quantum Mission)ను ఏపీకి తీసుకొచ్చామని, జనవరిలో అది ప్రారంభమవుతుందని తెలిపారు. “భవిష్యత్తు అంతా టెక్నాలజీదే… కష్టపడి కాకుండా స్మార్ట్గా పనిచేస్తే ఏదైనా సాధ్యమే” అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.








