ప్ర‌ధాని పొదుపు మంత్రం.. అయినా త‌గ్గ‌ని చంద్ర‌బాబు

ప్ర‌ధాని పొదుపు మంత్రం.. అయినా త‌గ్గ‌ని చంద్ర‌బాబు

దేశమంతా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని, పొదుపు మంత్రం జపించాలని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ హితబోధ చేస్తున్నా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం వాటిని బేఖాతరు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందంటూనే, మరోవైపు ముఖ్యమంత్రి తన విలాస సౌకర్యాల కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుబారా చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో తన అధికారిక నివాసం అప్‌గ్రేడేషన్ కోసం ఏకంగా రూ. 6.50 కోట్లు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం జీవో 52 జారీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది.

వాష్ రూమ్‌లకు మోడ్రన్ ఫిట్టింగ్..
కేవలం నివాసం అప్‌గ్రేడేషన్ పేరుతో ముఖ్యమంత్రి కార్యాలయం చేస్తున్న ఖర్చు వివరాలు చూస్తుంటే సామాన్యులు విస్తుపోతున్నారు. చంద్ర‌బాబు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సీఎం నివాసంలో ఇటాలియన్ మార్బుల్‌తో ఫ్లోరింగ్, ఇంటీరియర్ ఎలివేషన్ కోసం ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

వాష్ రూమ్‌లను ఆధునిక ఫిట్టింగ్స్‌తో పూర్తిగా రీ-డిజైన్ చేయడంతో పాటు, ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్‌లు, వార్డ్‌రోబ్స్ విస్తరణకు భారీ నిధులు కేటాయించారు. ఏకకాలంలో 21 మంది కూర్చుని భోజనం చేసేలా కొత్త డైనింగ్ హాల్, వీఐపీల కోసం ప్రత్యేక వెయిటింగ్ హాల్ మరియు విడిగా వీఐపీ ఎంట్రీని నిర్మించనున్నారు. ఇంటి పైకప్పుకు సన్ రూఫ్ ప్యానల్స్ ఇంటిగ్రేషన్, అధునాతన ఫర్నీచర్, విశిష్టమైన ఆర్ట్ వర్క్ (కళాఖండాలు) ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రధాని మాట పెడచెవిన?
ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆర్థిక భారాలపై ఆచితూచి అడుగు వేయాలని, దుబారా తగ్గించాలని సూచిస్తూ వస్తోంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అవేవీ పట్టించుకోకుండా తన నివాసాన్ని ఒక రాజప్రసాదంలా తీర్చిదిద్దేందుకు సిద్ధమైందన్న విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. అప్పుల ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలపై పన్నుల భారం మోపుతూ, ముఖ్యమంత్రి ఇలా తన ‘సోకుల’ కోసం 6.50 కోట్లు ఖర్చు చేయడంపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.

ప్రజల సొమ్ముతో పండగ!
సామాన్యుడికి ఇల్లు కట్టుకోవడం గగనమవుతున్న ఈ కాలంలో, కేవలం అప్‌గ్రేడేషన్ పేరుతో చంద్ర‌బాబు ఇంత పెద్ద మొత్తాన్ని కేటాయించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అటు ఢిల్లీలో నివాసం కోసం, ఇటు అమరావతిలో సౌకర్యాల కోసం కోట్ల రూపాయల ప్రజా ధనం విలాసాలకు వెచ్చిస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ ‘దుబారా’ వ్యవహారంపై చంద్ర‌బాబు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment