తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరుగుతున్న వరుస ఘటనలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట, లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం, ఘాట్ రోడ్డులో ప్రమాదం, అన్యమతస్తుల చర్యల వంటి సంఘటనలపై కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై పూర్తిస్థాయి నివేదిక అందించాలని టీటీడీ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.
సంఘటనలపై క్షేత్రస్థాయి పరిశీలన
ప్రత్యేక అధికారిగా సంజీవ్ కుమార్ జిందాల్ను నియమించిన కేంద్రం, వివాదాస్పద ఘటనలపై పూర్తిస్థాయి సమీక్షకు చర్యలు చేపట్టింది. జిందాల్, ఆదివారం మరియు సోమవారం తిరుపతి, తిరుమలలో పర్యటించి, టీటీడీ అధికారులతో సమావేశమవ్వనున్నారు. తొక్కిసలాట, అగ్ని ప్రమాదం తదితర ఘటనలపై పూర్తి వివరాలు సేకరించనున్నారు.

వరుస ప్రమాదాలు – భక్తుల ఆందోళన
జనవరి 8న వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనసంచారం అధికంగా ఉండడం వల్ల తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆరుగురు మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించినప్పటికీ, పవిత్ర పుణ్యక్షేత్రంలో దారుణ ఘటన చోటు చేసుకోవడంపై ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భక్తులలో ఆందోళన వ్యాప్తి చెందింది. టీటీడీ వరుస ఘటనపై కేంద్ర బృందం తన పరిశీలనలో ఎలాంటి లోపాలను ఎత్తిచూపనుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.