తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఛాలెంజ్ విసిరారు. సీఎం రేవంత్ కొడంగల్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధమవ్వాలని సూచించారు. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున తాము ప్రచారం చేయమని, అయినప్పటికీ రేవంత్ 50వేల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు కేటీఆర్.
తెలంగాణలో కౌరవ పాలన నడుస్తోంది
కొడంగల్లో రైతు నిరసన దీక్ష సందర్భంగా హాజరైన కేటీఆర్ కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తోందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు, మహిళలు, వృద్ధులు, యువత కోసం ఏమీ చేయలేదు అని విమర్శించారు.
రేవంత్ ప్రజల కోసం పనిచేయడం లేదని కేటీఆర్ ఆరోపించారు. . అనుముల అన్నదమ్ములు, అదానీల కోసమే పనిచేస్తున్నారన్నారు. భూములు గుంజుకోవాలనేదే సీఎం రేవంత్రెడ్డి ధ్యేయమని, రైతు బంధు డబ్బులు ఎవరికి వచ్చాయి?’’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. కొడంగల్ ప్రజలు రేవంత్ను నమ్మి మోసపోయారని, త్వరలోనే నిజాన్ని అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానించారు.