డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తిరుపతి (Tirupati) పర్యటనపై టీటీడీ(TTD) మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) సూటిగా సెటైర్లు వేశారు. పవన్ పర్యటన ఆద్యంతం హాస్యాస్పదంగా సాగిందని వ్యాఖ్యానించారు. భూమన మాట్లాడుతూ దట్టమైన అడవుల్లో చెట్లు నాటడం, పొంగే నదుల్లో నీళ్లు పోయడం, నల్ల కళ్లద్దాలతో పుస్తకాలు చదవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.
దట్టమైన అడవుల్లో మొక్కలు నాటడం ఏందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇది పర్యటననా, సినిమా షూటింగ్గా అన్నట్టుగా పవన్ కళ్యాణ్ పర్యటన సాగిందని భూమన విమర్శించారు. అదే సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలపైనా భూమన విమర్శలు గుప్పించారు. పవన్ పరిశీలించిన ఎర్రచందనం దుంగల్ని పట్టుకున్నది వైఎస్ జగన్ (YS Jagan) ప్రభుత్వ హయాంలోనే అని, 2 లక్షల టన్నుల ఎర్రచందనం (Red Sandalwood) అప్పుడే సీజ్ చేశారని గుర్తుచేశారు. కానీ, కూటమి పాలనలో ఒక్క దుంగ కూడా పట్టుకోలేదని, అయినా పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ తిరుపతిలో రాత్రి బస చేయకుండా హైదరాబాద్కు తిరిగి వెళ్లడంపై కూడా భూమన ప్రశ్నలు లేవనెత్తారు. “తిరుపతిలో వసతులు లేవా? లేక మరే కారణమా? సినిమా స్టైల్లో పర్యటన చేసి ఫొటోలు దిగడమే గాక, తిరుపతి ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. రాయలచెరువులో ఆవులు చనిపోయినప్పుడు కనీసం పరామర్శకైనా రాలేదు. రెండ్రోజుల పర్యటన అని చెప్పి ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతున్నారు” అని విమర్శించారు.
చివరగా.. “ప్రజలకు ఉపయోగపడేలా వ్యవహరించండి. మీ కూటమిని కాపాడుకునే కంటే, మీ జనసైనికులను కాపాడుకోవడానికి శ్రద్ధ చూపండి” అని భూమన కరుణాకర్రెడ్డి సూచించారు.








