విజయవాడ భవానీపురంలో 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న 42 ఫ్లాట్స్ యజమానులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. భారీ బందోబస్తు నడుమ జేసీబీలు, బుల్డోజర్లలో 42 నిర్మాణాలను కూల్చివేయడంతో నిరాశ్రయులుగా మారారు. 25 ఏళ్లుగా ఉంటున్న తమ ఇళ్లను కూల్చి రోడ్డు మీద పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలతో తమ ఇళ్లను నేలమట్టం చేసినా, ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని పరిష్కారం చూపించడం లేదని, కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదని బాధితులు కన్నీరుపెట్టుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టులో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి భవానీపురం బాధితులు తమ గోడును చెప్పుకున్నారు. 42 ఫ్లాట్స్ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. “మా ఇళ్లను కూల్చి రోడ్డున పడేశారు” అంటూ రోడ్డు మీద తలదాచుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు తాను, తన పార్టీ అండగా ఉంటానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
జగన్ ఆదేశంతో వైసీపీ నేతలు కూడా భవానీపురం ప్రాంతానికి చేరుకుని బాధితులకు ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్, ఇతర నాయకులు వెళ్లి అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. కూల్చివేసిన ఇళ్లను చూసి బాధితుల తరఫున పోరాటం చేస్తామన్నారు.
ఎందుకు కూల్చారంటే..
భవానీపురం ప్రాంతంలో లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో, భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్కడి 42 ఫ్లాట్స్ను అధికారులు జేసీబీలు, బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఈ క్రమంలో 25 ఏళ్లుగా అక్కడే నివసిస్తున్నామని చెప్పుకుంటున్న కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డునపడ్డాయి. తమ ఇళ్లను కూల్చేసి ప్రభుత్వమే తమను రోడ్డున పడేసిందని, ఎలాంటి ప్రత్యామ్నాయ వసతి కల్పించకుండా చర్యలు తీసుకోవడం అన్యాయమని బాధితులు ఆరోపిస్తున్నారు. కొందరు ఆత్మహత్యాయత్నాలకు కూడా పాల్పడగా, సీఎం ఇంటి ముట్టడికి బయల్దేరిన బాధితులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో, చివరికి బాధితులంతా వైఎస్ జగన్ను ఆశ్రయించడం రాజకీయ వాతావరణంలో చర్చనీయాంశంగా మారింది.








