సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) ఈరోజు (ఆగస్టు 19) ప్రకటించనున్నారు. ఈ టోర్నీలో టీమిండియా తమ మొదటి మ్యాచ్ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది.
భారత్-పాక్ మ్యాచ్పై సందేహాలు
అయితే, ఇటీవల పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ కారణంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ను భారత్ బహిష్కరించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, టీమిండియా మాజీ ఆల్రౌండర్ కేదార్ జాదవ్ ఈ మ్యాచ్ జరగదని గట్టిగా చెప్పారు.
“ఆసియా కప్లో పాకిస్తాన్తో భారత్ మ్యాచ్ ఆడకూడదు. టీమిండియా ఆడదనే నమ్మకం నాకు ఉంది. పాకిస్తాన్తో ఎక్కడ ఆడినా భారత్దే విజయం అవుతుంది. ఈ విషయం పాకిస్తాన్ జట్టుకు కూడా తెలుసు. అయినప్పటికీ ఈ మ్యాచ్ జరగకూడదు” అని జాదవ్ ఏఎన్ఐతో అన్నారు.
గతంలో దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలోనూ పాకిస్తాన్తో ఆడేందుకు ఇండియా ఛాంపియన్స్ నిరాకరించింది. ఆ లీగ్లో ఒక లీగ్ మ్యాచ్తో పాటు సెమీ ఫైనల్ను కూడా యువీ సారథ్యంలోని భారత జట్టు బహిష్కరించింది.
మ్యాచ్ జరిగే అవకాశాలే ఎక్కువ
డబ్ల్యూసీఎల్ ఒక ప్రైవేట్ లీగ్ కావడం వల్ల భారత్ ఆ మ్యాచ్లను బహిష్కరించగలిగింది. కానీ ఆసియా కప్ టోర్నీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి, పాకిస్తాన్తో భారత్ ఖచ్చితంగా తలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ టీమిండియా పాక్తో మ్యాచ్ను బహిష్కరిస్తే, బ్రాడ్కాస్టర్లకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుంది.







