మయన్మార్లో సైన్యం దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా, పశ్చిమ రఖైన్ రాష్ట్రంలోని రామ్రీ ద్వీపంలో అరకాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న క్యౌక్ నీ మావ్ అనే గ్రామంపై సైన్యం వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 40 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడినట్లు స్థానిక స్వచ్ఛంద సంస్థలు తెలిపాయి.
దాడి కారణంగా గ్రామంలో దారుణమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. గ్రామంలో ఇంటర్నెట్ సేవలు, సెల్ఫోన్ సిగ్నల్స్ కట్ చేశారు. దీంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. 2021 ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూచీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని సైన్యం గద్దె దించి అధికారం చేజిక్కించుకుంది. అప్పటి నుంచి ప్రజలపై దురాగతాలు పెరిగాయి.
శాంతియుత ప్రదర్శనలను అణిచివేయడం, సైనిక పాలనను వ్యతిరేకించే వారిపై వైమానిక దాడులు చేయడంతో అనేకమంది సైనిక పాలనకు వ్యతిరేకంగా ఆయుధాలు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సైన్యం దాడులు మయన్మార్లో పరిస్థితిని మరింత దిగజార్చాయి. సైనిక పాలన కఠిన చర్యలతో ప్రజల ప్రాణాలు, భద్రత ఆందోళనకర స్థితికి చేరాయి.