ఆంధ్రప్రదేశ్లో మహిళలపై దాడుల సంఖ్య పెరుగుతోందని, ఈ విషయంలో రాష్ట్రం నెంబర్ వన్గా నిలుస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే, మహిళలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు.
“స్త్రీ లేకపోతే సృష్టి లేదు, జననం లేదు, గమనం లేదు” అంటూ షర్మిల అన్నారు. తల్లిగా, సోదరిగా, భార్యగా, కూతురుగా మహిళ జీవితంలోని ప్రతి దశలో పురుషులను నడిపించే శక్తి అని ఆమె అభిప్రాయపడ్డారు. ఈరోజున దేశంలో, రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, మహిళలు అంటే బీజేపీకి కనీస గౌరవం లేదని ఆరోపించారు. ఓటు బ్యాంక్ కోసం మహిళలను సెకండ్ క్లాస్ సిటిజన్ కింద బీజేపీ లెక్కగడుతోందన్నారు. వికసిత భారత్ లో గంటకు 50 మందిపై భౌతిక దాడులు, రోజుకి 80 మందిపై లైంగిక వేదింపులు జరగడం అత్యంత శోచనీయమన్నారు.
ఇటు రాష్ట్రంలో సైతం మహిళలకు గౌరవం లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆరోపించారు. మహిళలపై దాడులలో ఆంధ్రప్రదేశ్ నెంబర్.1 గా ఉండటం సిగ్గుచేటన్నారు. మహిళా సాధికారిత పేరు చెబుతూ మోసం చేస్తున్నారన్నారు. మహిళలకు ఉచిత బస్సు, నెలకు రూ.15 వందల ఆర్థిక సహాయం, సున్నా వడ్డీకే రుణాలు, తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు లాంటి పథకాలు ఇస్తామని మహిళలకు టోకరా పెట్టారని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.