పశ్చిమాసియా దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు సామాన్యుడి పోయ్యి కింద సెగలు పుట్టిస్తున్నాయి. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న యుద్ధం.. ఇప్పుడు నేరుగా మన వంటింట్లోకి ప్రవేశించింది. అంతర్జాతీయంగా చమురు మరియు సహజ వాయువు సరఫరా గొలుసు దెబ్బతినడంతో, రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రరూపం దాల్చింది.
గ్యాస్ లేక ఆరుతున్న మంటలు
ప్రస్తుత పరిస్థితులు “వంటింట్లోకి వార్” వచ్చినట్లుగా తయారయ్యాయి. గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా గృహ వినియోగదారులతో పాటు ముఖ్యంగా వాణిజ్య రంగం కుదేలవుతోంది. సిలిండర్లు సకాలంలో అందక మంటలు ఆరిపోతుండటంతో మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారులు అల్లాడిపోతున్నారు.
హోటల్ పరిశ్రమపై పెను ప్రభావం
ఈ గ్యాస్ సంక్షోభం హోటల్ పరిశ్రమపై అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. గడిచిన కొద్ది రోజులుగా గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా హోటల్ నిర్వహణ భారంగా మారింది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల నుంచి సరఫరా దాదాపుగా నిలిచిపోయింది. దీంతో వంటలు వండటం సాధ్యం కాక, హోటళ్లు మూసివేసే పరిస్థితి నెలకొందని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హోటల్ యజమానుల సంఘం భేటీ
సరఫరా నిలిచిపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించేందుకు హోటళ్ల యజమానుల సంఘం అత్యవసరంగా భేటీ అయ్యింది. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే వ్యాపారులు భారీగా నష్టపోవడమే కాకుండా, వినియోగదారులకు కూడా తిప్పలు తప్పవని వారు హెచ్చరించారు. సిలిండర్ల కొరత వల్ల ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది. సరఫరా పునరుద్ధరించకపోతే వేలాది మంది కార్మికుల ఉపాధి దెబ్బతింటుంది.
ప్రభుత్వానికి డిమాండ్
హోటల్ నిర్వహణ నిరంతరాయంగా సాగేలా తక్షణమే గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని యజమానుల సంఘం ప్రభుత్వాన్ని మరియు గ్యాస్ కంపెనీలను డిమాండ్ చేస్తోంది. అత్యవసర ప్రాతిపదికన వాణిజ్య సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని తరుణంలో, ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ గ్యాస్ గండం నుంచి గట్టెక్కించాలని ప్రజలు కోరుకుంటున్నారు.








