గ్రాఫిక్స్‌కే రూ.401 కోట్లా..? అమ‌రావ‌తి ‘డిజైన్’ మాయాజాలం!

గ్రాఫిక్స్‌కే రూ.401 కోట్లా..? అమ‌రావ‌తి 'డిజైన్' మాయాజాలం!

రాజధాని నిర్మాణంలో ఇటుక పడకముందే అంకెల గారడీ మొదలైంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు చూస్తుంటే, రాజధాని నిర్మాణం కంటే ‘డిజైన్ల’ అలంకరణకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కేవలం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (AGC) భవనాల ఆకృతుల కోసమే ఏకంగా రూ. 401.54 కోట్లు కన్సల్టెన్సీలకు ధారపోయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మకీ అసోసియేట్స్ నిష్క్రమణ..
అమ‌రావ‌తి డిజైన్ల కోసం 2016లో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన టెండర్లలో జపాన్‌కు చెందిన ప్రఖ్యాత ‘మకీ’ అసోసియేట్స్‌ను తొలుత ఎంపిక చేశారు. అయితే, ఆ తర్వాత ఎలాంటి సరైన కారణం లేకుండా ఆ టెండర్‌ను రద్దు చేయడంపై మకీ చైర్మన్ పుమిహికో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.. టెండర్లలో పారదర్శకత లేదు.. లోపాయికారీ ఒప్పందాలే రాజ్యమేలుతున్నాయి” అని ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను మంటగలిపాయన్న విమ‌ర్శ‌లున్నాయి.

మళ్లీ మళ్లీ టెండర్లు.. అదే సంస్థలకు
మకీని పక్కన పెట్టిన సర్కారు, లండన్‌కు చెందిన ఫోస్టర్ పార్టనర్స్‌తో కలసి హఫీజ్ కాంట్రాక్టర్‌కు రూ. 67.86 కోట్లకు మాస్టర్ ఆర్కిటెక్ట్ పనులు ఇచ్చింది. ఇక్కడితో ఆగకుండా అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ల కోసం 2024 అక్టోబర్‌లో మళ్ళీ హఫీజ్ కాంట్రాక్టర్‌కే రూ. 136.90 కోట్లు కట్టబెట్టారు. జలమార్గం, బ్రిడ్జిల డిజైన్ల కోసం 2025 ఆగస్టులో అదే సంస్థకు మరో రూ. 59.90 కోట్లు ఇచ్చారు. గతంలో రద్దు చేసిన జెనిసిస్ ప్లానర్స్ సంస్థకే మళ్ళీ రూ. 136.88 కోట్లకు పనులు అప్పగించడం చూస్తుంటే, ఇది ముందస్తు ఒప్పందం (Quid Pro Quo) కాక మరేమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

రుషికొండపై రచ్చ.. అమరావతిలో ఖర్చు?
వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న ఐదేళ్ల టెన్యూర్‌లో విశాఖలోని రుషికొండ భవనాలు పర్యాటక రంగం కోసం రూ. 230 కోట్లతో నిర్మిస్తే, అది దేశంలోనే అతిపెద్ద తప్పిదమన్నట్లు యాగీ చేస్తున్న కూట‌మి ప్ర‌భుత్వ పెద్ద‌లు.. ఇప్పుడు కేవలం ఒక్క కాంప్లెక్స్ డిజైన్ల కోసమే రూ. 401 కోట్లు ఖర్చు చేయడాన్ని ఏమనాలి? నిర్మాణానికి అయ్యే ఖర్చు వేరు, కేవలం పేపర్ మీద గీసే బొమ్మలకే ఇన్ని వందల కోట్లా? అని ఆంధ్ర‌రాష్ట్ర ప్ర‌జ‌లు, ఆర్థిక నిపుణులు ప్ర‌శ్నిస్తున్నారు.

యోగా పేరుతో రూ. 300 కోట్ల వృథా
దీనికి తోడు, ఇటీవల నిర్వహించిన కేవలం గంట సేపు సాగిన ఒక యోగా క్యాంప్ కోసం ఏకంగా రూ. 300 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం గమనార్హం. ఒకవైపు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని చెబుతూనే, మరోవైపు ఇలాంటి ఆడంబరాలకు, గ్రాఫిక్ డిజైన్లకు వేల కోట్లు తగలేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? అప్పులు తెచ్చి మరీ డిజైన్ల కంపెనీల జేబులు నింపడం అవసరమా? ఈ వందల కోట్లతో ఎన్ని పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించవచ్చు? జవాబుదారీతనం లేని ఈ ‘డిజైన్’ రాజకీయం ఇంకెన్నాళ్లు? అని ప్ర‌జ‌లు, రాజ‌కీయ పండితులు ప్ర‌శ్నిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment