పహల్గామ్ (Pahalgam)లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ బుధవారం తెల్లవారుజామున చేపట్టిన “ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)” ను విజయవంతంగా ముగించింది. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)తో పాటు పాక్ భూభాగాల్లోని లష్కరే తోయిబా (Lashkar-e-Taiba), జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) వంటి ఉగ్రవాద సంస్థల ట్రైనింగ్ సెంటర్లు, కార్యాలయాలపై భారత్ క్షిపణుల దాడులు జరిపింది.
కేంద్రం అఖిలపక్ష సమావేశం
ఆపరేషన్ సింధూర్ విజయవంతం అనంతరం గురువారం కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నేతృత్వం వహించారు. సమావేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఎఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) పాల్గొన్నారు.
100 మంది ఉగ్రవాదుల హత్య
ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా సాగిందని, దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలకు పూర్తిగా వివరించారని ఆయన చెప్పారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగింది. సరిహద్దు భద్రత, భవిష్యత్తులో తీసుకునే చర్యలపై కూడా చర్చ కూడా అఖిలపక్ష సమావేశంలో జరిగింది. కేంద్రానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని అన్ని రాజకీయ పార్టీలు స్పష్టం చేశాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ “జాతీయ భద్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తాం” అన్నారు.