అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విమాన ప్రమాదంలో 265 మంది మృతి చెందడం యావత్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. కాగా, ఈ ప్రమాదంపై కేంద్రం ప్రత్యేక దృష్టిసారించింది. ఘటన ఎలా జరిగింది, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై దృష్టిసారించి, కేంద్ర హోం కార్యదర్శి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది.
కేంద్ర పౌర విమానయాన శాఖ ఏర్పాటు చేసిన ఈ అత్యున్నత స్థాయి కమిటీ, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం వెనుక గల కారణాలను సమగ్రంగా దర్యాప్తు చేయనుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి అవసరమైన చర్యలను సిఫార్సు చేస్తుంది. ఈ కమిటీ మూడు నెలల్లో తన సమగ్ర నివేదికను సంబంధిత మంత్రిత్వ శాఖకు సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అంచనా వేయడంతో పాటు, ప్రస్తుతం అమలులో ఉన్న ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు (SOPలు), భద్రతా మార్గదర్శకాలను కమిటీ సమీక్షిస్తుంది. విమాన భద్రతను మెరుగుపరచడం, ప్రమాదాలను నివారించడంపై ఈ కమిటీ ప్రధానంగా దృష్టిసారిస్తుంది. అయితే, ఈ కమిటీ స్వతంత్రంగా పనిచేస్తుందని, ఇతర చట్టబద్ధమైన లేదా సాంకేతిక దర్యాప్తులకు ప్రత్యామ్నాయం కాదని, వాటితో సంబంధం లేకుండా తన విధులను నిర్వర్తిస్తుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
కమిటీలో సభ్యులు..
- విమాన ప్రమాదాలపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ఈ ఉన్నత స్థాయి కమిటీలో వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు.
- కేంద్ర హోం కార్యదర్శి (చైర్మన్)
- పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి
- కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి
- గుజరాత్ ప్రభుత్వ హోం శాఖ ప్రతినిధి
- గుజరాత్ ప్రభుత్వ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన అథారిటీ ప్రతినిధి
- అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్
- భారత వైమానిక దళ తనిఖీ భద్రతా డైరెక్టర్ జనరల్
- డైరెక్టర్ జనరల్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ
- ఐబీ ప్రత్యేక డైరెక్టర్
- డైరెక్టర్ జనరల్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DG, DGCA)
- డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సర్వీసెస్ నుండి అధికారులు
- కమిటీ అవసరమని భావిస్తే, విమానయాన నిపుణులు, ప్రమాద పరిశోధకులు, న్యాయ సలహాదారులతో సహా ఏ ఇతర సభ్యుడిని అయినా చేర్చుకోవచ్చు.
కమిటీకి ఉన్న అధికారాలు
- విమాన డేటా, కాక్పిట్ వాయిస్ రికార్డర్లు, విమాన నిర్వహణ రికార్డులు, ATC లాగ్, సాక్షుల వాంగ్మూలాలతో సహా అన్ని రికార్డులను పరిశీలించడం.
- ప్రమాద స్థలాన్ని తనిఖీ చేయడం.
- సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, సంబంధిత సిబ్బంది నుండి వాంగ్మూలాలను సేకరించడం.
- విదేశీ పౌరులు, విమాన తయారీదారులు, అంతర్జాతీయ సంస్థలతో సహకరించడం.
- కమిటీ నిర్వర్తించే ప్రధాన విధులు