ఏపీఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళి అరెస్టుపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా దరిద్రంగా ఉన్నాయని పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్య చేశారు. ఇటీవల అరెస్టు అయి కోర్టు ఆదేశాల మేరకు జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పోసాని ఆరోగ్యం పట్ల దిగులుగా ఉందని, అతని ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బలహీనులైన వారిని అరెస్టుచేసి తీసుకెళ్లడం కచ్చితంగా పగ తీర్చుకోవడమేనని అన్నారు.
రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళి శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వెంటనే జైలు అధికారులు ఆయన్ను రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం కడప రిమ్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
పోసాని వైద్య పరీక్షల అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. రైల్వే కోడూరు సీఐ మీడియాతో మాట్లాడుతూ పోసాని ఆరోగ్యం విషయంలో డ్రామాలు ఆడుతున్నారని పచ్చిగా మాట్లాడడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.