జగన్ లక్ష్యంగా మరోసారి రెచ్చిపోయిన రాధాకృష్ణ.. రాజ్య‌స‌భ ఖాయమా..?

జగన్ లక్ష్యంగా మరోసారి రెచ్చిపోయిన రాధాకృష్ణ.. రాజ్య‌స‌భ ఖాయమా..?

తెలుగుదేశం పార్టీ అనుంగు ప‌త్రిక‌గా ముద్ర‌ప‌డిన ఆంధ్ర‌జ్యోతి య‌జ‌మాని, ఏబీఎన్ రాధాకృష్ణ ‘కొత్తపలుకు’ ద్వారా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాక‌ రేపుతున్నాయి. తాజాగా విడుదలైన ఏబీఎన్‌లోని కొత్త‌ప‌లుకు ప్రోమోపై మ‌రోసారి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొద‌లైంది. రాధాకృష్ణ విశృంఖ‌ల‌త్వ రాత‌లు వెనుక ప్ర‌భుత్వం నుంచి బ‌ల‌మైన‌దేదో ఆశిస్తున్న‌ట్లుగా అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఏబీఎన్ రాధాకృష్ణ తన ‘కొత్తపలుకు’ ద్వారా వైసీపీపై విమర్శల దాడిని మరింత ఉధృతం చేశారు. గత వారం వైసీపీ నేతల భార్యలపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దారితీసినప్పటికీ, రాధాకృష్ణ తన తీరు మార్చుకోలేద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన మరో ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు
గత ఆదివారం నాటి కథనంలో మహిళా ప్రతినిధులను ఉద్దేశించి చేసిన రాతలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మహిళా లోకాన్ని అవమానించారంటూ వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా రాధాకృష్ణ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ ఆందోళనలు చేపట్టాయి. తోటి జర్నలిస్టులు సైతం ఈ వ్యాఖ్యలను తప్పుబడుతున్నా, రాధాకృష్ణలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదని తాజా ప్రోమో స్పష్టం చేస్తోంది.

మావిగ‌న్‌పై అక్కసా? చంద్రబాబు స్క్రిప్టా?
అమరావతి అభివృద్ధికి వైఎస్ జగన్ అడ్డుపడుతున్నారనే అక్కసుతోనే చంద్రబాబు డైరెక్షన్‌లో రాధాకృష్ణ ఈ విధమైన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల జ‌గ‌న్ రాజ‌ధాని విష‌యంలో మావిగ‌న్ ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తెచ్చారు. దీనిపై రాష్ట్రంలో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతుండ‌గా, డైవ‌ర్ష‌న్‌లో భాగంగా రాధాకృష్ణ వైసీపీ నేత‌ల‌పై వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డిన‌ట్టుగా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. మీడియా ప్ర‌తినిధిగా ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా ఉండాల్సిన వ్యక్తి, ఫక్తు రాజకీయ నాయకుడిలా మారి ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజ్యసభ సీటు కోసమే ఈ ఆరాటమా?
రాధాకృష్ణ రాత‌ల‌పై రాజకీయ వర్గాల్లో మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. టీవీ5 అధినేతకు టీటీడీ చైర్మన్ పదవి దక్కగా, ఈనాడు వారసులకు అమరావతిలో కాంట్రాక్టులు దక్కాయని.. ఇప్పుడు రాధాకృష్ణ కూడా రాబోయే రాజ్యసభ సీటుపై కన్నేసి ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. ఇటీవల చంద్రబాబు నివాసానికి రాధాకృష్ణ స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లిన విషయాన్ని టీడీపీ నేతలే స్వయంగా లీక్ చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

రేప‌టి కొత్త ప‌లుకు కార్య‌క్ర‌మం ఇంకా ఎంత‌టి దిగ‌జారుడు వ్యాఖ్య‌లు ఉంటాయోన‌న్న అభిప్రాయాలు సోష‌ల్ మీడియాలో వ్య‌క్తం అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment