యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇద్దరు కేరళవాసులకు మరణశిక్ష అమలు చేయడం కలకలం రేపుతోంది. భారత విదేశాంగ శాఖ గురువారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. శిక్ష అమలు అయిన వారిని మహమ్మద్ రినాష్ అరింగిలొట్టు, మురళీధరన్ పెరుమ్తట్టు వలప్పిల్గా గుర్తించారు.
మహమ్మద్ రినాష్ స్థానిక యూఏఈ వాసి హత్య కేసులో దోషిగా తేలగా, మురళీధరన్ తన తోటి భారతీయుడిని హత్య చేసిన కేసులో శిక్షను ఎదుర్కొన్నారు. వీరి కుటుంబాలకు భారత రాయబార కార్యాలయం ఈ సమాచారాన్ని తెలియజేసింది.
ఫిబ్రవరి 28న యూఏఈ ప్రభుత్వం ఈ ఉరిశిక్షల గురించి భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందజేసింది. వెంటనే భారత విదేశాంగ శాఖ క్షమాభిక్ష పిటిషన్లు, అభ్యర్థనలు పంపించినప్పటికీ, యూఏఈ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అవసరమైన అన్ని రకాల దౌత్య, న్యాయ సహాయాన్ని భారత ప్రభుత్వం అందించినప్పటికీ, శిక్షను నిలిపివేయడం సాధ్యం కాలేదు.