ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు. వరంగల్ జిల్లాలో మామునూరుకు కేంద్రం కొత్తగా ఎయిర్పోర్ట్ మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి భూసేకరణ కోసం నిధులు ప్రకటన కూడా చేసింది. కేంద్ర ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. మంగళవారం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను రైతులు అడ్డుకున్నారు.
భూములు కోల్పోతున్న రైతులు తమకు న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టారు. నక్కలపల్లి రహదారి తొలగించొద్దని గుంటూరుపల్లి రైతులు డిమాండ్ చేశారు. రహదారి మార్గాన్ని చూపాలని మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
భూసేకరణ సర్వే కోసం వచ్చిన ఆర్డీవోను రైతులు అడ్డుకుని తక్షణమే సర్వే నిలిపివేయాలని స్పష్టం చేశారు. రైతులు ఎయిర్పోర్ట్కు వ్యతిరేకం కాదని చెబుతూ, విమానాశ్రయం రావడం సంతోషమే కానీ, భూములు కోల్పోవడం వల్ల భారీ నష్టాలను ఎదుర్కొంటున్నామని వారు వాపోయారు. మరి దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచిచూడాలి.