సైబర్ నేరగాళ్ల మోసాలను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సిమ్ కార్డులు కొనుగోలు చేయడంలో ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ నిబంధనలు జారీ చేసింది. సైబర్ మోసాలను ఎదుర్కొనేందుకు టెలికాం శాఖ (DoT) ఈ నిర్ణయం తీసుకుంది.
ఆధార్ లేకపోతే కొత్త సిమ్ రాదు!
ఇప్పటి వరకు ఓటర్ ఐడీ, పాస్పోర్ట్ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులతో కొత్త సిమ్ కార్డులు జారీ చేసేవారు. కానీ, తాజా నిబంధనల ప్రకారం, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాల్సిందే. ఆధార్ లేకుంటే ఇకపై సిమ్ కార్డు జారీ చేయరని స్పష్టం చేశారు.
నిబంధనల వెనుక కారణం
సైబర్ మోసాలు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును దోచుకునే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, వినియోగదారుల డేటా భద్రతను పెంపొందించేందుకు ఆధార్ వెరిఫికేషన్ కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.








