తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ జోష్ మొదలైంది. ఈ పండగ సీజన్లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు జనం తాకిడితో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో పరిస్థితి మరింత రద్దీగా మారింది. జనసందోహం దృష్ట్యా అధికారులు ప్రత్యేక రైళ్లు, బస్సులను నడపడం ప్రారంభించినప్పటికీ, రద్దీ తగ్గడం లేదు.
దక్షిణ మధ్య రైల్వే 188 ప్రత్యేక రైళ్లు నడిపిస్తుండగా, పండగ సందర్భంగా 33% అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. – శబరి యాత్ర, కుంభమేళా ప్రయాణాలతో కూడా రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. జనరల్ బోగీల సంఖ్య పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
బస్టాండ్లలో పరిస్థితి
ఆర్టీసీ అధికారులు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, నర్సీపట్నం, కాకినాడ, అమలాపురం, భీమవరానికి అదనపు బస్సులను కేటాయించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరింత ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే ట్రైన్స్, బస్సులు ఇప్పటికే నిండిపోయి, ఊరెళ్లే వారు ప్రత్యేక సర్వీసులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.








