అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ప్రాంతం తీవ్రమైన కార్చిచ్చుతో అల్లకల్లోలంగా మారింది. వేలాది ఎకరాల్లోని పచ్చని భూములు, విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విపత్తులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ లగ్జరీ ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైంది.
మాలిబులో ఉన్న హంటర్ బైడెన్ నివాసం ఈ కార్చిచ్చులో కాలి బూడిదైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇంటి ముందు ఉంచిన కారు సైతం మంటల్లో కాలిపోయిందని సమాచారం. 1950లో నిర్మితమైన మూడు గదుల లగ్జరీ ఇల్లు పూర్తిగా నాశనమైంది. ఈ విషయంలో జో బైడెన్ మాట్లాడుతూ, ఇంకా పూర్తి సమాచారం తమకు అందలేదని తెలిపారు.
కార్చిచ్చు ప్రభావం
లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు గురువారం హాలీవుడ్ హిల్స్ ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పటివరకు 2,000 నిర్మాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 50 బిలియన్ డాలర్ల (రూ.4.2 లక్షల కోట్లు) ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 1700 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు, మరో 7,500 మంది కాలిఫోర్నియా సిబ్బంది సన్నద్ధంగా ఉన్నారు. ప్రస్తుత కార్చిచ్చు తీవ్రత అమెరికాకు పెద్ద పరీక్షగా మారింది. సహాయక చర్యలతో పాటు, మంటలను అదుపులోకి తీసుకురావడంలో అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.