రాష్ట్ర స్థూల అభివృద్ధిని నియోజకవర్గ స్థాయి అభివృద్ధితో అనుసంధానం చేయాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. అభివృద్ధి పనులతో ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెంచుకుని, పార్టీ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వంపై వచ్చే విమర్శలను సానుకూలంగా మార్చుకుని ప్రజల మద్దతు కూడగట్టాలని సూచించారు.
రెండో రోజు టీడీపీ లీడర్ షిప్ కాంక్లేవ్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 15–20 రంగాల్లో జీఎస్డీపీని పెంచేలా నియోజకవర్గాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు అన్నారు. విజయవాడ సెంట్రల్, పాలకొల్లు, మండపేట, చిలకలూరిపేట, నెల్లూరు, తణుకు నియోజకవర్గాలు అభివృద్ధిలో ముందున్నాయని చెప్పారు.
డేటా సెంటర్లతో భారీగా ఉద్యోగాలు
రాష్ట్రానికి డేటా సెంటర్లు, భారీ పెట్టుబడులు వస్తే లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు అన్నారు. డేటా సెంటర్లకు అవసరమైన 5 టీఎంసీల నీరు పెద్ద సమస్య కాదని, పోలవరం ఎడమ కాలువ ద్వారా రోజుకు 2 టీఎంసీల వరకు నీటిని తరలించే అవకాశం ఉందన్నారు. గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్తున్న నీటిలో కనీసం 300 టీఎంసీలను వినియోగించుకోగలిగితే రాష్ట్ర పరిస్థితులను మార్చవచ్చని అన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్-1 డెవలపర్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
పుష్కరాలకంటే ముందే పోలవరం పూర్తిచేస్తా
పుష్కరాలకంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. పోలవరం ఫేజ్-2తో 190 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందని, బొల్లాపల్లి ప్రాజెక్టు పూర్తయితే ఈ సామర్థ్యం 350 టీఎంసీలకు చేరే అవకాశం ఉందని చెప్పారు. మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు. అన్ని ప్రాజెక్టులు పూర్తయితే సుమారు 1,400 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.








