తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR) గడువు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ఓటర్లకు మరింత సమయం కల్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వం భారత ఎన్నికల సంఘానికి (ECI) విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు లేఖ రాస్తూ, నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వాదనలు వినిపించేందుకు, అవసరమైన పత్రాలు సమర్పించేందుకు ప్రస్తుత గడువు సరిపోదని పేర్కొన్నారు. ప్రభుత్వం నాలుగు వారాల పాటు గడువు పెంచాలని కోరగా.. కనీసం మూడు వారాల పొడిగింపుపై ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఎన్నికల వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాతే తుది స్పష్టత రానుంది.
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు, అభ్యంతరాలను సెప్టెంబర్ 16 వరకు స్వీకరించనున్నారు. అనంతరం నోటీసుల జారీ, విచారణ, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 15 వరకు కొనసాగి.. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా ప్రచురించాల్సి ఉంది. గడువు పొడిగింపునకు ఈసీ ఆమోదం లభిస్తే ఈ తేదీల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. మరోవైపు SIRలో భాగంగా జారీ చేసిన నోటీసులపై విచారణలను వేగవంతం చేయాలని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సి. సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మ్యాపింగ్ కాని ఓటర్లు, ఓటరు వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న కేసుల్లో సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, ఓటర్లు సమర్పించే పత్రాలను నిబంధనల ప్రకారం ధ్రువీకరించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. గడువు పొడిగింపుపై అధికారిక నిర్ణయం వెలువడితే తుది ఓటర్ల జాబితా అక్టోబర్ నుంచి నవంబర్ చివరి వారానికి వాయిదా పడే అవకాశం ఉంది.








