నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టు నుంచి నల్లమలసాగర్కు చేరుతున్న కృష్ణా జలాల ప్రవాహంలో బొలెరో వాహనం కొట్టుకుపోయిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతు కాగా.. మరో ముగ్గురిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. అధికారులు ఇప్పటికే ముంపు గ్రామాలను ఖాళీ చేయించినప్పటికీ.. నీరు వదలడం, అవి ఉధృతంగా ప్రవహించడంతో ఈ ఘటన చోటుచేసుకుందని సమాచారం.
వివరాల్లోకి వెళితే.. పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి రాత్రి సమయంలో అరటి కాయలు కోసేందుకు నలుగురు వ్యక్తులు బొలెరో వాహనంలో వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఉన్న వాగును దాటేందుకు ప్రయత్నించారు. అప్పటికే కృష్ణా జలాల ప్రవాహంతో వాగులో నీటి ఉధృతి పెరిగింది. వాగును దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా ప్రవాహం ఉధృతం కావడంతో బొలెరో వాహనం అదుపుతప్పి నీటిలో కొట్టుకుపోయింది.
ఈ ప్రమాదంలో వాహనంతో పాటు అందులోని నలుగురు నీట మునిగారు. వీరిలో మరో ముగ్గురు వ్యక్తులు ప్రవాహం నుంచి తప్పించుకుని సమీపంలోని చెట్లపైకి ఎక్కారు. మరొక వ్యక్తి మాత్రం వరద ప్రవాహంలో గల్లంతయ్యాడు. అక్కడ చిక్కుకుపోయిన వారు సహాయం కోసం కేకలు వేయగా, సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెట్లపై చిక్కుకున్న ముగ్గురిని గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే వాహనంతో పాటు గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
వెలిగొండ ప్రాజెక్టు ప్రవాహంలో కొట్టుకుపోయిన బొలేరో
— Telugu Feed (@Telugufeedsite) September 1, 2026
సీఎం చంద్రబాబు ప్రారంభించిన తొలిదశ వెలిగొండ ప్రాజెక్టు నుంచి నల్లమలసాగర్కు చేరుతున్న కృష్ణా జలాలు
ప్రవాహంలో కొట్టుకుపోయిన ఓ బొలెరో వాహనం
రాత్రి 7 గంటల సమయంలో పెద్దారవీడు మండలం కలనూతలలో అరటి కాయలు కోసేందుకు వెళ్లిన నలుగురు… https://t.co/kI7a8x2xis pic.twitter.com/7avqrPUdRn







