టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తన భవిష్యత్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచ కప్ తన ఆలోచనల్లో ఉందని, 2023లో చేజారిన ప్రపంచ కప్ను ఈసారి ఎలాగైనా గెలవాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. జర్నలిస్ట్ విమల్ కుమార్తో జరిగిన సంభాషణలో రోహిత్.. వన్డే ప్రపంచ కప్కు తన దృష్టిలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పాడు. 2023లో ఫైనల్ వరకు వెళ్లి టైటిల్ను కోల్పోవడం తనలో ఇంకా ఉందని, ఈసారి ట్రోఫీని ముద్దాడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
‘ఇది నాకు చివరి అవకాశం’..
2027 ప్రపంచ కప్ తనకు చివరి వన్డే ప్రపంచ కప్ అవకాశం కావచ్చని రోహిత్ భావోద్వేగంగా చెప్పాడు. 50 ఓవర్ల ప్రపంచ కప్ అత్యంత కఠినమైన టోర్నీల్లో ఒకటని, దానికి ఎంతో ప్రత్యేకత ఉందని పేర్కొన్నాడు. ఇప్పటికే టీ20, టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన హిట్మ్యాన్.. ప్రస్తుతం వన్డే ఫార్మాట్పైనే దృష్టి పెట్టాడు. ప్రపంచ కప్ వరకు కొనసాగాలంటే ఫిట్నెస్ను కాపాడుకోవడం, తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడం కీలకమని అతడి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
2023 బాధకు 2027లో ముగింపు పలుకుతాడా?
2023 వన్డే ప్రపంచ కప్లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు చేరినా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్ను చేజార్చుకుంది. ఆ టోర్నీలో రోహిత్ దూకుడైన బ్యాటింగ్తో జట్టుకు అదిరిపోయే ఆరంభాలు అందించాడు. ఇప్పుడు కెరీర్ చివరి దశలో ఉన్న హిట్మ్యాన్ ముందు మరోసారి ప్రపంచ కప్ రూపంలో పెద్ద లక్ష్యం నిలిచింది. 2027లో 39 ఏళ్ల వయసులో అతడి ఫిట్నెస్, ఫామ్, జట్టు అవసరాలు కీలకంగా మారనున్నాయి. అయితే ప్రపంచ కప్ గెలవాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని రోహిత్ స్పష్టం చేయడంతో.. అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.








