భారత్(India), శ్రీలంక(Sri Lanka) జట్ల మధ్య ఆగస్టు 15 (శనివారం) నుంచి రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్(Test Series) సమరానికి తెరలేవనుంది. గాల్ (Galle) వేదికగా ప్రారంభమయ్యే తొలి మ్యాచ్లో యంగ్ కెప్టెన్ శుభ్మన్ గిల్(Shubman Gill) నాయకత్వంలో బరిలోకి దిగుతున్న టీమిండియా(Team India), పర్యటనను విజయంతో ఘనంగా ప్రారంభించాలని పట్టుదలతో ఉంది. ఆగస్టు 15 నుంచి 27 వరకు సాగే ఈ సిరీస్ క్రికెట్ ప్రేమికులకు మంచి వినోదాన్ని పంచనుంది. ఈ టెస్ట్ సిరీస్లో ఒక ప్రత్యేక ఆకర్షణ అభిమానులను అలరించబోతోంది. ఇన్నాళ్లూ తన అద్భుత బ్యాటింగ్తో ప్రత్యర్థులను కంగారు పెట్టిన భారత మాజీ టెస్టు కెప్టెన్ అజింక్య రహానే(Ajinkya Rahane), ఇప్పుడు పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నాడు. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ ఫస్ట్ క్లాస్ కెరీర్కు వీడ్కోలు పలికిన రహానే, ఇప్పుడు మైదానంలో బ్యాట్ పక్కనపెట్టి కామెంట్రీ బాక్స్లో(Commentary Box) మైక్ పట్టేందుకు సిద్ధమయ్యాడు. తన క్రికెట్ ప్రయాణంలో తొలిసారి వ్యాఖ్యాతగా(Commentator) మారి అభిమానులకు తన గళంతో కొత్త అనుభూతిని అందించనున్నాడు. భారత్-శ్రీలంక సిరీస్ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీల్లో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్(Sony Sports Network), లైవ్ స్ట్రీమింగ్ ద్వారా సోనీ లివ్ (Sony LIV) యాప్లో తిలకించవచ్చు.
టీమిండియా తరఫున క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడల్లా అపద్బాంధవుడిలా ఆదుకుని జట్టును విజయతీరాలకు చేర్చిన ఘనత రహానేది. భారతదేశం తరఫున 85 టెస్టు మ్యాచ్లు ఆడిన అతడు 5,077 పరుగులు సాధించాడు. ఇందులో 12 అద్భుతమైన సెంచరీలు, 26 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మైదానంలో కెప్టెన్గా, సీనియర్ ప్లేయర్గా ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. ఇక, ఈ కొత్త బాధ్యతపై రహానే ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. టెస్టు క్రికెట్ అనేది ఆటలోనే అత్యుత్తమ రూపు అని పేర్కొన్న రహానే, ఇన్నాళ్లూ దేశం కోసం మైదానంలో పోరాడిన తర్వాత, ఇప్పుడు అదే ఆటను ఒక కొత్త కోణం నుంచి చూడటం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాడు. మ్యాచ్లో కెప్టెన్లు తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలు, ఆటను మలుపు తిప్పే చిన్న చిన్న క్షణాలు, టెస్ట్ క్రికెట్లోని లోతైన విషయాలను వీక్షకులతో పంచుకోవడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని స్పష్టం చేశాడు.








