ఉద్యోగ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల కావడం లేదంటూ నిరుద్యోగ యువకుడు (Unemployed Youth) మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మిపురం గ్రామానికి చెందిన గడ్డం వేణు కుమార్ (Gaddam Venu Kumar) నిద్రమాత్రలు, ఎలుకల మందు కలిపి తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం ఖమ్మంలోని ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో (Prashanthi Super Speciality Hospital) చికిత్స పొందుతున్నాడు.
స్థానికుల సమాచారం ప్రకారం, గత ఐదేళ్లుగా గ్రూప్స్ ఉద్యోగాల (Groups Jobs) కోసం సిద్ధమవుతూ పలు పరీక్షలు రాసినా ఫలితం లేకపోవడంతో వేణు కుమార్ తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. గత రెండున్నరేళ్లుగా ఉద్యోగాల కోసం నిరంతరం చదువుతున్నప్పటికీ ప్రభుత్వం (Government) కొత్త గ్రూప్ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఆత్మహత్యాయత్నానికి ముందు వేణు కుమార్ రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్లో తన మరణానికి ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడమే కారణమని పేర్కొన్నాడు. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) దృష్టికి వెళ్లాలని కోరాడు. అలాగే తన తల్లి వికలాంగురాలని, తమ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు కాలేదని సూసైడ్ నోట్లో ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.








