చిన్నారులపై లైంగిక నేరాల నివారణకు పోక్సో (POCSO) చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విస్తృత లేఖ రాశారు. ఇటీవల తెలంగాణలోని షాబాద్లో చోటుచేసుకున్న ఘటనను ప్రస్తావిస్తూ, పోక్సో కేసుల్లో నిందితులకు బెయిల్ మంజూరులో మరింత జాగ్రత్త అవసరమని సూచించారు. బాధితులకు వేగవంతమైన న్యాయం అందేలా దర్యాప్తు, ఫోరెన్సిక్ ప్రక్రియలు, వైద్య పరీక్షలు నిర్దిష్ట గడువులో పూర్తిచేయాలని కోరారు. అలాగే పోక్సో కేసులను విచారించే అధికారులకు ప్రత్యేక శిక్షణ, డిజిటల్ ఆధారాల సేకరణ, DNA, FSL నివేదికలను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని ప్రతిపాదించారు.
ప్రతి పోక్సో కేసులో బాధితుల రక్షణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఉండాలని, అవసరమైతే పోలీసు భద్రత, ఎస్కార్ట్ సౌకర్యం కల్పించాలని పవన్ సూచించారు. నేర చరిత్ర ఉన్న లేదా బాధితులను బెదిరించే నిందితులపై రౌడీషీట్లు తెరవాలని, రాష్ట్రవ్యాప్తంగా ఏకరీతి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) అమలు చేయాలని కోరారు. పోక్సో కేసుల్లో ఆలస్యం లేకుండా వెంటనే FIR నమోదు చేయాలని, నిర్లక్ష్యం చేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పాఠశాలలు, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు, ప్రార్థనా మందిరాల్లో పిల్లల భద్రత కోసం తప్పనిసరి రిపోర్టింగ్ వ్యవస్థ అమలు చేయాలని సూచించిన పవన్, తాను చేసిన ప్రతిపాదనలపై 30 రోజుల్లో కార్యాచరణ నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. చిన్నారులపై లైంగిక నేరాలను అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించి తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.








