ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే శాటిలైట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర రూ.1,34,166 (ట్యాక్స్ తో కలిపి)గా నిర్ణయించినట్లు సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. సాధారణ మొబైల్ నెట్వర్క్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలు, సముద్ర ప్రాంతాలు, విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఈ ఫోన్ ద్వారా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సేవలు పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. డిఫెన్స్, మారిటైమ్, విపత్తు నిర్వహణ బృందాలతో పాటు ప్రత్యేక అవసరాలున్న సంస్థలకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడనున్నాయి.
2018 జనవరి 1 నుంచి గ్లోబల్ శాటిలైట్ ఫోన్ సేవల ద్వారా సాధారణ ప్రజలు, ప్రైవేట్ సంస్థలకు కూడా వాయిస్, ఎస్ఎంఎస్ సేవలు అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. ప్రభుత్వ సంస్థలకు నెలకు రూ.3,500, కమర్షియల్ సంస్థలకు రూ.5,835 నుంచి పోస్ట్పెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 16 నిమిషాల ఉచిత టాక్టైమ్ తో పాటు ఎస్ఎంఎస్ సౌకర్యం కూడా ఉంటుంది. నిర్ణీత పరిమితి దాటిన తర్వాత ప్రభుత్వ సంస్థలకు నిమిషానికి లేదా ఒక్కో ఎస్ఎంఎస్కు రూ.18, కమర్షియల్ సంస్థలకు రూ.25 చొప్పున ఛార్జీలు వర్తిస్తాయి. శాటిలైట్ ఫోన్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని సంప్రదించాలని సంస్థ సూచించింది.







