హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో అర్ధరాత్రి జరిగిన కారు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ నివాసంలోకి అదుపుతప్పిన కారు దూసుకెళ్లడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఇంటి ప్రధాన గేటుతో పాటు ప్రహారీ గోడ పూర్తిగా ధ్వంసమైంది.
అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కారు అతివేగంగా ప్రయాణించడం వల్లే డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాద సమయంలో కారులో పలువురు యువకులు ఉన్నట్లు తెలుస్తుండగా, మద్యం మత్తులో వాహనం నడిపిన అవకాశంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటనపై సమాచారం అందుకున్న ఫిల్మ్నగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. డ్రైవర్ మద్యం సేవించాడా? అతివేగమే ప్రమాదానికి కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, విజయవాడకు చెందిన కాకాని ధర్మ సత్య సాయి శ్రీనివాస మహేష్ అలియాస్ ధర్మ మహేష్.. సత్యానంద్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ పొంది ‘సింధూరం’ (2023), ‘డ్రింకర్ సాయి’ (2024) చిత్రాల ద్వారా గుర్తింపు పొందారు. ఈ ఘటన ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారగా, పోలీసులు త్వరలో పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.








