తెలంగాణ కాంగ్రెస్లో ఎస్ఐఆర్ (SIR) అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎస్ఐఆర్ను అత్యంత కీలకమైన అంశంగా పేర్కొన్న ఆయన, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు మరింత బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు.
జిల్లాల వారీగా నిర్వహించిన అవగాహన సదస్సులపై తన వద్ద పూర్తి నివేదిక ఉందని వెల్లడించిన సీఎం, కొందరు నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు.
పార్టీ ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించే నాయకులపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. ఎస్ఐఆర్ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న ఇన్చార్జ్లను గుర్తించి, వారి స్థానంలో వెంటనే కొత్త వారిని నియమిస్తామని స్పష్టం చేశారు.
మార్పు చూపేందుకు కేవలం 10 రోజుల గడువు మాత్రమే ఇస్తున్నానని, ఆ తర్వాత పనితీరు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. పేద ప్రజల ఓట్లు తొలగిపోతే ఆధార్, రేషన్ వంటి కీలక ప్రయోజనాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటూ, సర్పంచ్లు, స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుని ప్రతి గ్రామంలో ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.








