పర్యవేక్షణ ఉంటే ‘నీట్’ పేపర్ ఎలా లీక్ అయ్యింది?

పర్యవేక్షణ ఉంటే ‘నీట్’ పేపర్ ఎలా లీక్ అయ్యింది?

దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ (NEET-UG) పరీక్షల పేపర్ లీకేజీ ఉదంతంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణలో వైఫల్యాలపై దాఖలైన పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్ర విద్యాశాఖకు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి కీలక ఆదేశాలు జారీ చేసింది.

“అంత పెద్ద పర్యవేక్షణ యంత్రాంగం ఉన్నప్పటికీ నీట్ పేపర్ ఎలా లీక్ అయ్యింది? పర్యవేక్షణ ఉన్నా లీకేజీ జరిగిందంటే.. పరీక్షల నిర్వహణ ప్రక్రియలో తీవ్ర లోపాలు ఉన్నట్లే” అని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎన్టీఏను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని కేంద్ర విద్యా శాఖను ఆదేశించింది.

ఈ లీకేజీ వ్యవహారంపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖకు సుప్రీంకోర్టు గడువు విధించింది. పేపర్ లీక్ ఘటన, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకుంటున్న చర్యలపై ఆరు వారాల్లోగా పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. పరీక్షల సంస్కరణల కోసం నియమించిన ‘డాక్టర్ రాధాకృష్ణన్ హై పవర్ కమిటీ’ మరియు ‘మానిటరింగ్ కమిటీ’ చేసిన సిఫారసులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు అయ్యాయా? లేదా? అనే విషయాన్ని కూడా అఫిడవిట్‌లో నివేదించాలని ఆదేశించింది.

పేపర్ లీక్ వ్యవహారం వల్ల రాత్రింబవళ్లు కష్టపడి చదివిన వేలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులు తీవ్ర మనోవేదనకు, గందరగోళానికి గురయ్యారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన కేంద్ర సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు కీలక విషయం వెల్లడించారు. నీట్ పరీక్షల అంశాన్ని, ఎన్టీఏలో తీసుకురావాల్సిన సంస్కరణలను స్వయంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యవేక్షిస్తున్నారని ఆయన ధర్మాసనానికి వివరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment