తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలు (Producers), ఎగ్జిబిటర్ల (Exhibitors) మధ్య పర్సంటేజ్ వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ అత్యవసరంగా సమావేశమై ఒక కీలక ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్, సుదర్శన్ థియేటర్ అధినేత బాలగోవింద్ రాజ్, రవీంద్ర గోపాల్ తదితరులు పాల్గొని టాలీవుడ్ నిర్మాతలపై తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెద్ది సినిమాకు తమకు ఖచ్చితంగా ‘పర్సంటేజ్ సిస్టమ్’ (Percentage System) అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
సంవత్సరం దాటినా పరిష్కారం శూన్యం
ఈ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ.. “తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కమిటీతో ఇప్పటికే రెండు మూడు సార్లు చర్చలు జరిగాయి. ‘హరిహర వీరమల్లు’ సినిమా సమయంలోనే రెండు నెలల్లో మా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి సంవత్సరం దాటిపోతున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కావాలనే నిర్మాతలు ఈ వ్యవహారాన్ని లేట్ చేస్తున్నారు. మమ్మల్ని నిర్మాతలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. మొదట మూడు వారాల్లో సమస్య తేలుస్తామన్నారు, ఇప్పుడు మళ్లీ ఆరు వారాలు అంటున్నారు. ఏదో ఒకటి చెప్పాలనే ఉద్దేశంతో ‘గ్రేడింగ్’ అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇకపై పెద్ది సినిమాకు పర్సంటేజ్ విధానం ఇస్తేనే థియేటర్లలో సినిమాలు ఆడిస్తాము” అని స్పష్టం చేశారు.
ఎగ్జిబిటర్ల పరిస్థితి దయనీయం
సుదర్శన్ థియేటర్స్ బాలగోవింద్ రాజ్ మాట్లాడుతూ ఎగ్జిబిటర్ల దీన స్థితిని వివరించారు. “ప్రస్తుతం దాదాపు 120 మంది థియేటర్స్ ఓనర్స్ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు 10, 15 ఏళ్ల క్రితం థియేటర్స్ కి మంచి రెవిన్యూ ఉండేది. కానీ ఇప్పుడు ఎగ్జిబిటర్స్ కి రూపాయి రావడం లేదు. కానీ నిర్మాతలకు మాత్రం ఓటీటీ, శాటిలైట్, థియేట్రికల్ ఇలా దాదాపు 14 రకాలుగా ఆదాయం వస్తోంది. మాకు పర్సెంటేజ్ విధానం కావాల్సిందే.. అది ఎంత ఇస్తారో క్లియర్గా చెప్పండి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశమంతా పర్సంటేజ్.. ఇక్కడే రెంటల్ సిస్టమ్!
ఎగ్జిబిటర్ల ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా థియేటర్లకు పర్సంటేజ్ విధానమే నడుస్తోందని, ఒక్క మన దగ్గర మాత్రమే ఇంకా పాత ‘రెంటల్ సిస్టమ్’ నడుపుతున్నారని గుర్తుచేశారు. సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేయడం వల్ల ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, తక్షణమే కూర్చొని ఒక ముగింపు పలకాలని డిమాండ్ చేశారు.
కొత్త అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్ ఎన్నిక..
కాగా, ఈ కీలక సమావేశంలోనే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) నూతన అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. కొత్త నాయకత్వంలో ఎగ్జిబిటర్ల హక్కుల కోసం మరింత బలంగా పోరాడతామని ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ ఎగ్జిబిటర్ల సమ్మె హెచ్చరికలు మరియు పర్సంటేజ్ డిమాండ్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. రాబోయే పెద్ది సినిమా విడుదలపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.









సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. విప్ పదవికి జనసేన ఎమ్మెల్యే రాజీనామా