కాకినాడ (Kakinada) రూరల్ పరిధిలోని కొవ్వూరు బ్రిడ్జి (Kovvuru Bridge) సమీపంలో శనివారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక టిప్పర్ లారీ బీభత్సం సృష్టించడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిందిలా..
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. చీడగ గ్రామానికి చెందిన కొందరు కూలీలు ఉదయాన్నే ఉపాధి హామీ పనుల నిమిత్తం బయలుదేరారు. వారు కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా, అతివేగంగా వచ్చిన ఒక టిప్పర్ లారీ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్ (ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి)(GGH – Government General Hospital)కి తరలించారు.
లారీ డ్రైవర్ మద్యం (Alcohol) మత్తులో వాహనాన్ని అడ్డదిడ్డంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి.. – కన్నబాబు
ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల వైఎస్ఆర్ సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు (Kurasala Kannababu) కాకినాడ జీజీహెచ్కు చేరుకున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించి, వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రమాదంలో మరణించిన ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం (ఎక్స్గ్రేషియా) చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపాడన్న ఆరోపణలు వస్తున్నాయని, ఉదయం పూటే ఇలాంటి ఘటనలు జరగడం చూస్తుంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతల పరిస్థితి, మద్యం నియంత్రణ ఎలా ఉందో అర్థమవుతోందని ఆయన మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని కన్నబాబు హామీ ఇచ్చారు.








